షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!

- August 28, 2026 , by Maagulf
షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!

షార్జా: యూఏఈలోని షార్జాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఏడేళ్ల బాలిక సఫా ముబారక్ భవనం మూడో అంతస్తు కిటికీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సఫాను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన సమయంలో బాలిక తల్లి ముర్షిదా పనిలో ఉండగా.. తండ్రి ముబారక్ కారు పార్కింగ్‌ నుంచి తరలించేందుకు కొద్దిసేపు బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సఫా మృతదేహాన్ని షార్జా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించగా.. బంధువులు, స్నేహితులు, కుటుంబానికి పరిచయం ఉన్న పలువురు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. అవసరమైన అధికారిక ప్రక్రియలు, ఇస్లామిక్ సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.

కుటుంబ సభ్యుల ప్రకారం.. సఫా ఇటీవలే భారత్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై కుటుంబంతో కలిసి షార్జాకు తిరిగి వచ్చింది. ఆమె ఎంతో చురుకైన, తెలివైన, అందరితో కలివిడిగా మాట్లాడే చిన్నారి అని బంధువులు గుర్తుచేసుకున్నారు. సఫా మృతదేహాన్ని గురువారం రాత్రి భారత్‌కు తరలించి, కేరళలోని స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com