బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!

- August 31, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!

మనామా: బహ్రెయిన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటితో నిండిన బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి మూడేళ్ల భారతీయ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానిక ప్రవాస భారతీయ సమాజంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతుడిని కేరళలోని కొట్టాయం జిల్లా పాలాకు చెందిన ధ్యాన్ సూర్యగా గుర్తించారు. అతడు బహ్రెయిన్‌లో నివసిస్తున్న మేఘా (అల్ఫోన్సా జోస్) ఏకైక కుమారుడు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బహ్రెయిన్‌లో చాలాకాలంగా ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్న మేఘా.. బిజీగా ఉండటంతో కుమారుడిని గతంలో కేరళలోని బంధువుల వద్ద ఉంచారు. ఓనం పండుగ సందర్భంగా తల్లితో కలిసి ఉండేందుకు ధ్యాన్ నాలుగు రోజుల క్రితమే బహ్రెయిన్‌కు వచ్చాడు.

వంటగదిలో తల్లి.. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన బాలుడు
ప్రమాదం జరిగిన సమయంలో మేఘా వంటగదిలో ఆహారం సిద్ధం చేస్తున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో బాలుడు ఒంటరిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ నీటితో నిండిన బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయాడు.

బాలుడిని గుర్తించిన వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మనామాలోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్కు తరలించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ బాలుడి ప్రాణాలను కాపాడలేకపోయారు.
మేఘా బహ్రెయిన్ కేరళీయ సమాజం (BKS)లో యాక్టివ్ సభ్యురాలిగా ఉన్నారు. ధ్యాన్ ఆకస్మిక మరణంతో బహ్రెయిన్‌లోని ప్రవాస కేరళీయ సమాజంలో విషాదం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com