సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- August 31, 2026
రియాద్: తప్పుడు సమాచారం ఇవ్వడం, ప్రజలను తప్పుదోవ పట్టించే వివరాలు అందించడం వంటి నేరాలకు సౌదీ అరేబియాలో కఠిన శిక్షలు ఉన్నాయని సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ (SOCPA) హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, 2 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు వివిధ నేరాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఏడుగురు వ్యక్తులు, సంస్థలను SOCPA పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించింది. అకౌంటింగ్, ఆడిటింగ్ చట్టంలోని ఆర్టికల్ 10 పరిధిలోకి వచ్చే ఉల్లంఘనలు గుర్తించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్లు తాము ధృవీకరించే ఆర్థిక నివేదికలు, సమాచారానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని SOCPA స్పష్టం చేసింది. తాము లేదా తమ పర్యవేక్షణలో పనిచేసే సిబ్బంది ఆడిట్ చేయని ఆర్థిక నివేదికలను సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ ధృవీకరించడం కూడా చట్టప్రకారం నేరమని పేర్కొంది. ఇలాంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నేరాలకు పాల్పడిన వారికి ఐదేళ్లకు మించని జైలు శిక్ష, 2మిలియన్ రియాల్స్ వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపింది.
లైసెన్స్ పొందేందుకు తప్పుడు సమాచారం లేదా నకిలీ ధ్రువపత్రాలు సమర్పించడం, వృత్తిని నిర్వహించే హక్కు గురించి ప్రజలను ఏ విధంగానైనా తప్పుదోవ పట్టించడం కూడా నేరాల పరిధిలోకి వస్తాయి. అలాగే సర్టిఫైడ్ అకౌంటెంట్కు తెలిసినప్పటికీ వెల్లడించాల్సిన సమాచారాన్ని దాచడం, తప్పుడు సమాచారం అందించడం, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న నివేదికను ధృవీకరించడం వంటి చర్యలపైనా చట్టపరమైన చర్యలు ఉంటాయని SOCPA తెలిపింది.
ఆర్థిక నివేదికల విశ్వసనీయత కీలకం
SOCPA సీఈఓ డాక్టర్ అహ్మద్ అల్-ముఘామిస్ మాట్లాడుతూ.. ఆర్థిక నివేదికల విశ్వసనీయత దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి, సంస్థలు, లబ్ధిదారులు, ఆర్థిక నివేదికలను ఉపయోగించే వారికి రక్షణ కల్పించడానికి అత్యంత కీలకమని అన్నారు. అకౌంటింగ్, ఆడిటింగ్ వ్యవస్థలో SOCPA బాధ్యతలను నియంత్రణ, న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడం ద్వారా నిబంధనల అమలు మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడంతో పాటు ఆర్థిక సమాచారం విశ్వసనీయత, వృత్తిపరమైన సేవల నాణ్యతను పెంచేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







