తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..

- September 03, 2026 , by Maagulf
తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..

 హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరింత హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు తెలంగాణ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కేబినెట్ లో భారీగా మార్పులకు ఛాన్స్:

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్‌లో ఖాళీ అయిన 3 బెర్తులను భర్తీ చేసే అంశంపై కాంగ్రెస్ నేతల్లో ఆశలను రేకిత్తిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ సమయంలో విస్తృత మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ముహుర్తం ఖరారైనట్టేనా?

ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. ఆదివారం వరకే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ‘ముహూర్తం’ ఖరారయ్యే అవకాశంపై జోరుగా అంచనాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్కరి తొలగింపుతో ఆగకుండా ఖాళీగా ఉన్న స్థానాలు, పెండింగ్‌లో ఉన్న శాఖల విషయంలో పూర్తి రీ-అరేంజ్‌మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు.

వారికే బెర్త్ దక్కనుందా?

ఈ విస్తరణలో ఎవరి ఛాన్స్ ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినా బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అలాగే, కొందరు సీనియర్ నేతలకు, పార్టీకి సేవలతో పాటు రాజకీయ సమీకరణల ప్రభావంతో కీలక బెర్తులు దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

అదే సమయంలో కొండా సురేఖ శాఖ దేవాదాయ, అటవీ, పర్యావరణ వంటి కీలక శాఖలను ఏ విధంగా హ్యాండిల్ చేస్తారన్న ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సి ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. కానీ, తుది నిర్ణయం ఎప్పుడు, ఎవరు ఎలా అనేది అధికారిక ప్రకటనతోనే తేలనుంది.

కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం:

ఇదిలా ఉండగా, కొండా సురేఖ బర్తరఫ్ కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కూడా ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ ఎదుటే ఆయన సంతకం చేశారు. గవర్నర్ తో భేటీ తర్వాత సీఎం రేవంత్ తిరిగి వెళ్లిపోయారు. రేవంత్ వెంట లోక్ భవన్ కు మంత్రులు పొన్నం, అజారుద్దీన్ వెళ్లారు. కొండా సురేఖ బర్తరఫ్ తో క్యాబినెట్ లో 3 బెర్తులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందనే చర్చ మొదలైంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com