నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!

- September 04, 2026 , by Maagulf
నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!

రియాద్: నిర్మాణ పనుల కారణంగా గాలిలో దుమ్ము కాలుష్యం పెరగకుండా సౌదీ అరేబియాలోని రియాద్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిర్మాణ ప్రాజెక్టుల నుంచి వెలువడుతున్న దుమ్మును నియంత్రించేందుకు తనిఖీలు, పర్యవేక్షణను మరింత ముమ్మరం చేసినట్లు నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ కంప్లయన్స్ (NCEC) తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ దుమ్ము కాలుష్యానికి కారణమవుతున్న నిర్మాణ ప్రాజెక్టులపై మొత్తం SR20 మిలియన్ల జరిమానాలు విధిస్తున్నారు. రియాద్ నగరంలో గాలి నాణ్యతను మెరుగుపరచడం, నిర్మాణ కార్యకలాపాల వల్ల ప్రజలపై పడుతున్న పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

NCEC రియాద్ బ్రాంచ్ డైరెక్టర్ ఫవాజ్ అల్-ముజ్తహిల్ మాట్లాడుతూ..రియాద్ రాయల్ కమిషన్, రియాద్ మున్సిపాలిటీ సహకారంతో నిర్మాణ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఫిబ్రవరిలో విడుదల చేసిన విధాన మార్గదర్శకాల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఈ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పర్యవేక్షణ బృందాలు ముందుగా ఉల్లంఘనలను గుర్తించి, వాటిని సరిచేసినట్లు నిర్ధారించిన తర్వాతే నిబంధనలు పాటించని ప్రాజెక్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. నిర్మాణ ప్రాజెక్టులను 24 గంటలు, వారంలో 7 రోజులు పర్యవేక్షిస్తున్నట్లు NCEC వెల్లడించింది. తద్వారా దుమ్ము కాలుష్యానికి కారణమయ్యే ప్రాంతాలను ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

16 ఎయిర్ క్వాలిటీ స్టేషన్లతో నిఘా

రియాద్ ప్రాంతంలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు 12 స్థిరమైన మానిటరింగ్ స్టేషన్లు, 4 మొబైల్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఈ స్టేషన్లు గాలి నాణ్యతకు సంబంధించిన 22 అంశాలను పర్యవేక్షించి విశ్లేషిస్తాయి. దీని ద్వారా కాలుష్య స్థాయిలను గుర్తించడం, నిర్దేశిత ప్రమాణాల ఉల్లంఘనలను గుర్తించడం, అవసరమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.  పెద్ద నిర్మాణ ప్రాజెక్టులకు సమీపంలో ఉండేలా గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్లను పునర్వ్యవస్థీకరించారు. ముఖ్యంగా దిరియాహ్ గేట్, అల్-మురబ్బా ప్రాజెక్ట్ వంటి భారీ నిర్మాణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గాలి నాణ్యతను కాపాడేందుకు నిరంతర పర్యవేక్షణ, నిబంధనల అమలు మరింత కీలకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com