రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్

- September 06, 2026 , by Maagulf
రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి బాటలు వేస్తూ, రూ. 70,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు దాని అనుబంధ సంస్థ ‘హైపర్‌వాల్ట్’ ప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన కీలక సమావేశంలో సీఎం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ పరిధిలో దాదాపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (GW) సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో దాదాపు 7,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు.

 

రతన్ టాటాకు అంకితంగా రేడియల్ రోడ్డు–2028 జూన్ 2 నాటికి ప్రారంభం

ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే 50 కిలోమీటర్ల మేర నిర్మించే ‘రేడియల్ రోడ్-1’ను ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న దివంగత రతన్ టాటా జ్ఞాపకార్థం ఆయనకే అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతేకాకుండా, ఈ డేటా సెంటర్‌ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని టాటా సంస్థ ప్రతినిధులకు మరియు అధికారులకు సీఎం గడువు విధించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఈ పెట్టుబడి అత్యంత కీలకమైన మలుపు కానుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com