కువైట్లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- September 10, 2026
కువైట్: పాఠశాలల్లో భద్రత, క్రమశిక్షణ, వృత్తిపరమైన వాతావరణాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కువైట్ విద్యాశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. పాఠశాలల్లో పనిచేసే బోధన, పరిపాలనా, ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. విద్యాశాఖ అండర్సెక్రటరీ డాక్టర్ ఖాలెద్ అల్-రషీద్ జారీ చేసిన సర్క్యులర్లో పలు కీలక ఆంక్షలను పేర్కొన్నారు.
పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి ఈవెంట్లు, కార్యకలాపాలు, వేడుకలు నిర్వహించాలన్నా సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా స్పష్టమైన లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. అలాగే పాఠశాలల్లో ఫొటోగ్రఫీ నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలి. విద్యాశాఖకు వెలుపల ఉన్న వ్యక్తులు లేదా సంస్థలను కూడా అధికారిక అనుమతి లేకుండా పాఠశాలలకు ఆహ్వానించరాదని ఆదేశించింది.
పాఠశాలల్లో ఏ ఉద్దేశంతోనైనా డబ్బులు సేకరించడం, బహుమతులు, విరాళాలు స్వీకరించడం నిషేధించారు. విద్యార్థులు లేదా సిబ్బందికి వ్యక్తిగత లేదా ఆర్థిక ప్రయోజనం కోసం వస్తువులు, సేవలను విక్రయించడం, ప్రచారం చేయడం, ప్రకటనలు ఇవ్వడం కూడా అనుమతించరు.
పాఠశాల క్యాంటీన్లకు కూడా కఠినమైన నిబంధనలు విధించారు. అనుమతి లేని వనరుల నుంచి ఆహారం, పానీయాలను విక్రయించడం లేదా పంపిణీ చేయడం నిషేధించారు. పాఠశాలలు ప్రతిరోజూ క్యాంటీన్లను పర్యవేక్షించాలని, నిబంధనల ఉల్లంఘనలను నమోదు చేయాలని, ఆరోగ్య, ఆహార భద్రత ప్రమాణాలను పూర్తిగా పాటించేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది.
విద్యార్థుల వ్యక్తిగత సమాచారంపై కీలక ఆదేశాలు
విద్యార్థులను ఫొటోలు తీయడం, వీడియో లేదా ఆడియో రికార్డు చేయడం, వారి ఫోటోలను లేదా వ్యక్తిగత సమాచారాన్ని ప్రచురించడం వంటివి ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులకు సంబంధించిన పాఠశాల పత్రాలు, గోప్య సమాచారం, డేటాను బయటకు వెల్లడించడం లేదా దుర్వినియోగం చేయడం కూడా నిషేధించారు.
విద్యాశాఖ లేదా పాఠశాల తరఫున అధికారిక అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు చేయడం, వార్తలు ప్రచురించడం లేదా మీడియాకు సమాచారం ఇవ్వడంపై నిషేధం విధించారు. తరగతి గదుల్లో విద్యేతర అవసరాల కోసం మొబైల్ ఫోన్లు లేదా స్మార్ట్ పరికరాలను ఉపయోగించరాదని ఉపాధ్యాయులకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం లేదా ఇతర నిబంధనలను ఉల్లంఘించడం జరిగితే సంబంధిత వ్యక్తులను వెంటనే న్యాయ వ్యవహారాల విభాగానికి పంపి దర్యాప్తు, క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్







