విశాఖ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్..

- September 10, 2026 , by Maagulf
విశాఖ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వైజాగ్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునేవారికి నేరుగా ఫ్లైట్ అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వాణిజ్య రాజధాని విశాఖపట్నం అంతర్జాతీయ విమానయాన పటంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతపు దశాబ్దాల కలను నిజం చేస్తూ, భోగపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అక్టోబర్ 27న తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కానుంది. స్థానిక వాణిజ్య బృందాలు సంవత్సరాల తరబడి చేసిన నిరంతర ప్రయత్నాలు, లాబీయింగ్ ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ విశాఖపట్నం నుండి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు నేరుగా.. నాన్‌స్టాప్ సర్వీసును నడపడానికి శ్రీకారం చుట్టింది. విస్తారమైన ఫార్మాస్యూటికల్ రంగాలు, ప్రధాన ఓడరేవు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లు, బహుళ సముద్రపు ఆహార ఎగుమతి మార్కెట్ ఉన్నప్పటికీ, నాణ్యమైన అంతర్జాతీయ అనుసంధానం లేక ఇక్కడి ప్రయాణికులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్, చెన్నై లేదా న్యూఢిల్లీ వంటి ఇతర నగరాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ తాజా విమాన సర్వీసు అందుబాటులోకి రావడం ద్వారా ఆ అడ్డంకి శాశ్వతంగా తొలగిపోనుంది.

ప్రతి మంగళవారం, శుక్రవారం
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ సర్వీసును వారానికి రెండుసార్లు నడుపుతుంది. ఫ్లైట్ IX 904 ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 11:30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, థాయ్‌లాండ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:00 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ IX 903 ప్రతి బుధవారం, శనివారం తెల్లవారుజామున 2:10 గంటలకు బ్యాంకాక్ నుండి బయలుదేరి, తెల్లవారుజామున 3:55 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. ప్రాథమికంగా వన్-వే ఎకానమీ తరగతి ఛార్జీలను రూ. 16,300 నుండి రూ. 19,400 మధ్య నిర్ణయించారు. ఈ విమాన షెడ్యూల్ పర్యాటకులతో పాటు వ్యాపార ప్రాతిపదికన ప్రయాణించే కార్పొరేట్ వర్గాలకు కూడా ఎంతగానో సౌకర్యవంతంగా ఉండనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com