బహ్రెయిన్లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- September 11, 2026
మనామా: విద్వేష ప్రసంగాలు, సహజీవనం లేదా సామాజిక ఐక్యతకు భంగం కలిగించే చర్యలకు కఠిన శిక్షలు విధించేలా బహ్రెయిన్ ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది. ఏడు ఆర్టికల్స్తో కూడిన ఈ బిల్లును రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు తీసుకురానున్నారు. 2025 నాటి డిక్రీ నంబర్ 67కు అనుబంధంగా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం విద్వేష ప్రసంగాలు లేదా సహజీవనం, సామాజిక ఐక్యతకు హాని కలిగించే చర్యలకు గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్షతో పాటు BD10,000 వరకు జరిమానా విధించవచ్చు.
విద్వేష ప్రసంగం అంటే..
ప్రజలు లేదా వర్గాల మధ్య గొడవలు, మత లేదా సామాజిక ఉద్రిక్తతలు, హింస, వివక్షను ప్రేరేపించే ఏ రూపంలోని వ్యక్తీకరణనైనా విద్వేష ప్రసంగంగా బిల్లు నిర్వచిస్తోంది. ఇతరుల సమాన హక్కులు, స్వేచ్ఛలను గౌరవించడం, వివక్ష, హింస, ద్వేషం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును గౌరవించడాన్ని ‘సహనం’గా బిల్లు పేర్కొంటోంది.
ప్రసంగం మాత్రమే కాదు.. పలు రూపాల్లో వర్తింపు
వివక్షకు దారితీసే చర్యలు, ద్వేషాన్ని రెచ్చగొట్టడం, హింసకు పిలుపునివ్వడం లేదా హింసకు పాల్పడటం కూడా చట్ట పరిధిలోకి వస్తాయి. బిల్లు ప్రకారం ప్రసంగాలు, రచనలు, చిత్రాలు, సంకేతాలు, ఫొటోలు, పాటలు, నటన, హావభావాలు వంటి అనేక రూపాల్లో జరిగే చర్యలకు నిబంధనలు వర్తిస్తాయి.
అలాగే వార్తాపత్రికలు, రేడియో, టెలివిజన్, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు, వెబ్సైట్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా తదితర మాధ్యమాల్లో జరిగే చర్యలు కూడా చట్ట పరిధిలో ఉంటాయి. నేరానికి ప్రయత్నించినా అదే శిక్ష వర్తించనుంది. ఒక చర్య కారణంగా మరో నేరం జరిగితే దాన్ని అదనపు తీవ్రతగా పరిగణిస్తారు.
కంపెనీలకు భారీ జరిమానా
ఒక సంస్థ పేరు మీద, సంస్థ తరఫున లేదా సంస్థ ప్రయోజనం కోసం ఇలాంటి నేరం జరిగితే సంబంధిత కంపెనీలు లేదా ఇతర చట్టబద్ధ సంస్థలకు BD5,000 నుంచి BD20,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. బోర్డు సభ్యుడు, మేనేజర్, అధీకృత అధికారి లేదా బాధ్యత వహించే వ్యక్తి చర్య, నిర్లక్ష్యం, అనుమతి, నేరాన్ని దాచిపెట్టడం లేదా తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా నేరం జరిగితే సంస్థపై క్రిమినల్ బాధ్యత కూడా పడవచ్చు. అదే సమయంలో సంబంధిత వ్యక్తి వ్యక్తిగత క్రిమినల్ బాధ్యత కూడా కొనసాగుతుంది.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు మినహాయింపు
బిల్లులోని ఆర్టికల్ 6 ప్రకారం.. సహజీవనం లేదా సహనానికి హాని కలిగించే లేదా అలాంటి హానిని ప్రోత్సహించే ప్రసంగం, చర్యలను సమర్థించేందుకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కారణంగా చూపలేరు. చట్టాన్ని ఉల్లంఘించే విద్వేష ప్రసంగాలకు కూడా ఇదే వర్తిస్తుంది.
బహ్రెయిన్లోని కింగ్ హమద్ గ్లోబల్ సెంటర్ ఫర్ కోఎగ్జిస్టెన్స్ అండ్ టాలరెన్స్.. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ సంస్థలతో కలిసి సహజీవనం, సహనం, విద్వేష ప్రసంగాలపై కార్యక్రమాలను సమన్వయం చేయనుంది. విద్య, అవగాహన కార్యక్రమాలను ప్రతిపాదించడం, సమానత్వం మరియు సంభాషణను ప్రోత్సహించడం, ఇతరులను అంగీకరించేలా ప్రజలను ప్రోత్సహించడం, ద్వేషం, హింస, తీవ్రవాదం, అసహనంతో వచ్చే ప్రమాదాలపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను కేంద్రం చేపట్టనుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







