తెలంగాణలో కొత్త జిల్లాల ప్రక్రియ చివరి దశకు..

- August 20, 2016 , by Maagulf
తెలంగాణలో కొత్త జిల్లాల ప్రక్రియ చివరి దశకు..

 తెలంగాణలో కొత్త జిల్లాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈరోజు జరిగే అఖిలపక్ష సమావేశంలో కేబినెట్ సబ్‌ కమిటీ నివేదికపై అభిప్రాయాలు సేకరించనున్నారు. దసరా నుంచి ఎలాగైనా కొత్త జిల్లాలను ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీని కోసం ఓ వైపు కార్యాచరణ రూపొందిస్తూనే అభిప్రాయ సేకరణ చేపడుతోంది. ప్రభుత్వం నియమించిన సబ్‌కమిటీ కొత్త జిల్లాలపై నివేదికను సీఎంకు సమర్పించింది. కొత్తగా 27 జిల్లాలను, 58 రెవెన్యూ డివిజన్లను 533 మండలాలను ప్రతిపాదించింది ఉపసంఘం. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలోని సి బ్లాక్‌లో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ కూడా దీనికి హాజరవుతారు.మంత్రివర్గ ఉపసంఘం నివేదికను అఖిలపక్ష సమావేశం ముందు ఉంచనున్నారు. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి.కాకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం చేసే జిల్లాలను వ్యతిరేకించాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేలా జిల్లాల విభజన సరికాదంటున్నాయి. అఖిలపక్ష సమావేశానికి ముందే సబ్ కమిటీ ప్రతిపాదనలను తమకు ఇవ్వాలని కోరుతున్నాయి. నివేదిక ఇస్తే ప్రభుత్వం ప్రతిపాదనలపై అధ్యయనం చేసి అభిప్రాయాలు చెప్పడానికి వీలవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మకు లేఖ రాశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com