గల్ఫ్ టూరిజం రికవరీకి కీలక నిర్ణయాలు..!!

- September 11, 2026 , by Maagulf
గల్ఫ్ టూరిజం రికవరీకి కీలక నిర్ణయాలు..!!

మనామా: గల్ఫ్ దేశాల్లో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసి, రికవరీని వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాంతీయ టూరిజం సహకారం, సంయుక్త ప్రచార కార్యక్రమాలు, కొత్త టూరిజం ప్యాకేజీల రూపకల్పనపై గల్ఫ్ దేశాల పర్యాటక మంత్రులు చర్చించారు. బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ దేశాల పర్యాటక మంత్రుల కమిటీ 10వ సమావేశం జరిగింది. బహ్రెయిన్ పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గల్ఫ్ దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాంతీయ పర్యాటక రంగం పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికపై మంత్రులు చర్చించారు. గల్ఫ్ దేశాలను ఒకే పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేసేలా సంయుక్త ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.అలాగే కొత్త టూరిజం ప్యాకేజీలు, పర్యాటక కార్యక్రమాలు రూపొందించడం, అంతర్జాతీయ పర్యాటక మార్కెట్లలో గల్ఫ్ ప్రాంతానికి మరింత ప్రాధాన్యం తీసుకురావడం వంటి అంశాలపై చర్చ జరిగింది.

యూనిఫైడ్ టూర్ గైడ్ లైసెన్స్

పర్యాటక గణాంకాలు, డేటా పరస్పర మార్పిడి, సంయుక్త మార్కెటింగ్ కార్యక్రమాలతో పాటు యూనిఫైడ్ టూర్ గైడ్ లైసెన్స్ ప్రతిపాదనను కూడా సమావేశంలో పరిశీలించారు. హోటళ్ల వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు, 2027 గల్ఫ్ టూరిజం క్యాపిటల్ ఎంపికపైనా చర్చించారు. అంతర్జాతీయ సహకారాన్ని పెంచడంతో పాటు సంయుక్త టూరిజం కార్యక్రమాలు, ఈవెంట్లను నిర్వహించడం ద్వారా గల్ఫ్ దేశాలను పోటీతత్వం కలిగిన ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగంలో పరస్పర సహకారం ద్వారా ఆర్థిక అభివృద్ధి, ప్రాంతీయ సమగ్రతకు మరింత ఊతం లభిస్తుందని బహ్రెయిన్ పర్యాటక మంత్రి ఫాతిమా అల్ సైరాఫీ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com