పాస్పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- September 11, 2026
దుబాయ్: విమాన ప్రయాణంలో చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ చెకింగ్, లగేజ్ వంటి ప్రక్రియలను పూర్తిగా మార్చే దిశగా దుబాయ్ అడుగులు వేస్తోంది. భవిష్యత్లో ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేస్తే చాలు.. విమానాశ్రయంలో పాస్పోర్ట్ బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. ల్యాప్టాప్, లిక్విడ్స్ను బ్యాగ్ నుంచి తీసి చూపించాల్సిన పనీ ఉండదు. లగేజ్కు పేపర్ ట్యాగ్ కూడా అవసరం ఉండదు.
దుబాయ్ ఎయిర్పోర్ట్స్ CEO పాల్ గ్రిఫిత్స్ ఈ భవిష్యత్ ప్రయాణ అనుభవాన్ని వివరించారు. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC)లో నిర్మిస్తున్న అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంప్రదాయ విమానాశ్రయ ప్రక్రియల్లోని ఇబ్బందులను తొలగించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు.
టికెట్ కొంటే చాలు.. చెక్-ఇన్ మాయం
ప్రయాణికుల పాస్పోర్ట్, ఇతర వివరాలను టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే నమోదు చేసే విధానం తీసుకురావాలని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ భావిస్తోంది. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులు తమ లగేజ్ను డ్రాప్ చేసి నేరుగా ముందుకు వెళ్లవచ్చు. ఫేషియల్ రికగ్నిషన్, సీలింగ్, గోడలకు అమర్చిన కెమెరాలు ప్రయాణికుడిని, అతని విమానాన్ని గుర్తిస్తాయి. దీంతో ప్రత్యేకంగా చెక్-ఇన్ కౌంటర్ వద్ద నిలబడాల్సిన అవసరం ఉండదు.
పాస్పోర్ట్ బయటకు తీయాల్సిన పని లేదు
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కూడా ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా సులభతరం కానుంది. ప్రయాణికులు పాస్పోర్ట్ బయటకు తీసి చూపించకుండా నిరంతరం ముందుకు కదులుతూనే ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ ప్రక్రియలను పూర్తి చేసే విధానంపై పని జరుగుతోంది. అలాగే కొత్త సెక్యూరిటీ స్క్రీనింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వీటి ద్వారా ల్యాప్టాప్లు, లిక్విడ్స్ను బ్యాగ్ నుంచి బయటకు తీయాల్సిన అవసరం లేకుండా తనిఖీలు చేయవచ్చు.
లగేజ్పై పేపర్ ట్యాగ్ కూడా ఉండదు
లగేజ్ నిర్వహణలోనూ భారీ మార్పులు చేయాలని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ భావిస్తోంది. ప్రస్తుతం బ్యాగ్లకు పేపర్ ట్యాగ్లు ఎందుకు అవసరమని పాల్ గ్రిఫిత్స్ ప్రశ్నించారు. కార్లకు ప్రత్యేకమైన VIN నంబర్ ఉన్నట్లే, ప్రతి బ్యాగ్కు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు ఉండే విధానాన్ని తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణికుడు బ్యాగేజ్ కారౌసెల్ వద్దకు చేరుకునేలోపే అతని సూట్కేస్ సిద్ధంగా ఉండేలా బ్యాగేజ్ ప్రాసెసింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
సెక్యూరిటీ చెక్ కూడా మరింత సులభం
విమానాశ్రయ సెక్యూరిటీ చెకింగ్లో ప్రయాణికులు భారీ బ్యాగ్లను కన్వేయర్ బెల్ట్పై ఎత్తి పెట్టాల్సిన అవసరం లేకుండా చేయాలని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ యోచిస్తోంది. ప్రయాణికులు నడుస్తూనే హ్యాండ్ బ్యాగేజ్ను మూవింగ్ బెల్ట్పై ఉంచి, మరోవైపు నుంచి దాన్ని తీసుకునేలా వ్యవస్థను రూపొందించే ఆలోచన ఉంది.
DXB కార్యకలాపాలు కొత్త విమానాశ్రయానికి
ప్రస్తుతం ఉన్న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) కార్యకలాపాలను పూర్తిగా అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు తరలించనున్నారు. తొలి దశ కార్యకలాపాలు 2032లో ప్రారంభం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా మారనుంది. దీని సామర్థ్యం ఏటా 260 మిలియన్ల మంది ప్రయాణికులకు చేరుకోనుంది.
రైలు దిగగానే నేరుగా విమానాశ్రయంలోకి
విమానాశ్రయానికి అనుసంధానమయ్యే రైలు స్టేషన్ల నుంచి కూడా ఇదే తరహా సులభమైన ప్రయాణ ప్రక్రియను తీసుకురావడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA), ఇతర సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్లో రైలు నుంచి దిగిన ప్రయాణికులు నేరుగా లాంజ్లు, షాపులు లేదా రెస్టారెంట్లకు వెళ్లేలా వ్యవస్థ ఉండనుంది. ఇవి వారి విమానం ఉన్న ప్రాంతానికి కేవలం 50 మీటర్ల పరిధిలో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
‘విమానాశ్రయంలో ఉన్నట్లు అనిపించకూడదు’
“ప్రయాణికులు విమానాశ్రయంలో ఉన్నట్లు కూడా అనిపించకూడదన్నదే మా లక్ష్యం” అని పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసి, క్యూలు, అనవసర తనిఖీలు, ఇతర అసౌకర్యాలను తగ్గిస్తే వారు విమానాశ్రయంలో షాపింగ్, భోజనం, ఇతర కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత ఈ విధానం ద్వారా కొత్త టెర్మినల్ నిర్మించకుండానే ప్రస్తుత సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం ఉందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ భావిస్తోంది.
తాజా వార్తలు
- పుతిన్కు ప్రధాని మోదీ అరుదైన కానుక!
- ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
- కువైట్లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!







