అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు

- September 16, 2026 , by Maagulf
అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు

అబుదాబి: రోడ్డు దాటే సమయంలో పాదచారులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. పాదచారులను వాహనాలు ఢీకొన్న మూడు ఘటనలకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన పోలీసులు, రోడ్డు భద్రతలో పాదచారులు, వాహనదారులు ఇద్దరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఒక ఘటనలో ఇద్దరు వ్యక్తులు నిర్దేశిత క్రాసింగ్‌ ప్రాంతం నుంచి రోడ్డు దాటుతున్నప్పటికీ, వాహనదారుడు వేగాన్ని తగ్గించకపోవడంతో వారిని ఢీకొట్టాడు. పాదచారుల క్రాసింగ్‌లకు సమీపంలో వాహనదారులు వేగాన్ని తగ్గించి, పూర్తి అప్రమత్తతతో డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచించారు.

మరో ఘటనలో కొంతమంది పాదచారులు నిర్దేశిత ప్రాంతాలను ఉపయోగించకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు. దీంతో వారు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకున్నారు. పాదచారులు తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్‌లు, పాదచారుల వంతెనలు, అండర్‌పాస్‌లు ఉపయోగించాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించాలని అబుదాబి పోలీసులు సూచించారు.

జైవాకింగ్‌కు జరిమానా

యూఏఈలో నిర్దేశిత ప్రాంతాలు కాకుండా రోడ్డు దాటడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. జైవాకింగ్‌కు Dh400 జరిమానా విధించవచ్చు. అయితే, నిర్దేశిత ప్రాంతం కాకుండా రోడ్డు దాటడం వల్ల ట్రాఫిక్ ప్రమాదం జరిగితే, ప్రస్తుత ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం Dh5,000 నుంచి Dh10,000 వరకు జరిమానా, జైలు శిక్ష లేదా రెండింటిలో ఒకటి విధించవచ్చు.

80 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగ పరిమితి ఉన్న రహదారులపై నిర్దేశిత ప్రాంతం కాకుండా రోడ్డు దాటితే నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కనీసం మూడు నెలల జైలు శిక్ష, కనీసం Dh10,000 జరిమానా లేదా రెండింటిలో ఒకటి విధించే అవకాశం ఉంది.

అదే సమయంలో, పాదచారుల క్రాసింగ్‌ల వద్ద వాహనదారులు వేగాన్ని తగ్గించి, రోడ్డు దాటుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అబుదాబి పోలీసులు స్పష్టం చేస్తూ, పాదచారులు నిబంధనలు పాటించాలని, వాహనదారులు క్రాసింగ్ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com