కమల్ హాసన్ క్లాప్‌తో మొదలైన ‘ఎం.ఎస్’ బయోపిక్‌.. అలరించనున్న రష్మిక!

- September 17, 2026 , by Maagulf
కమల్ హాసన్ క్లాప్‌తో మొదలైన ‘ఎం.ఎస్’ బయోపిక్‌.. అలరించనున్న రష్మిక!

భారతరత్న, సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ‘ఎం.ఎస్’ (A Legacy On Screen) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తోంది. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ చిత్రాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌ పూజా కార్యక్రమాలు చెన్నై వేదికగా వైభవంగా జరిగాయి.

కమల్ హాసన్ చేతుల మీదుగా ముహూర్తపు షాట్

ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నటుడు కమల్ హాసన్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వరల్డ్ క్లాస్ మేకింగ్, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీతం మనకు అందించిన సందేశం

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. “తన అద్భుతమైన గాత్రంతో భారతదేశాన్ని, ముఖ్యంగా సౌత్‌ను ఏకం చేసిన ఘనత ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మకే దక్కుతుంది. సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ ఇలా ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తీసుకొచ్చేవారు. ఆమె ఆలపించిన సుప్రభాతం, లలిత సహస్రనామం వింటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మహాత్మా గాంధీ వంటి మహనీయులు కూడా ఆమెకు అభిమానులే. ఈ తరం మహిళల్లో విశ్వాసాన్ని నింపిన ఐకానిక్ పర్సనాలిటీ ఆమె” అని కొనియాడారు.

రష్మికపై కమల్ సరదా వ్యాఖ్యలు & ప్రముఖుల సమక్షం

చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ రష్మిక పాత్రపై కమల్ హాసన్ సరదాగా స్పందించారు. “సుబ్బులక్ష్మి అమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న రష్మికను చూస్తే అసూయగా ఉంది. ఒకవేళ నేను గడ్డం తీసేసినా ఆమె స్థానంలో నటించి మెప్పించలేను. ఈ గొప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలకు, దర్శకుడు గౌతమ్‌కు నా బెస్ట్ విషెస్” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి సుహాసిని, శివకుమార్, సముద్రఖని, నిర్మాతలు కలైపులి థాను, కాట్రగడ్డ ప్రసాద్‌తో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్ దంపతులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com