సిలికా ఎగుమతి అక్రమ మార్గంలో
- September 20, 2016
ప్రకృతి సంపద తరలిపోతుంటే... ఆ ప్రభావం సముద్రంపై పడుతోంది. అడవులు, భూగర్భ సంపద తరిగిపోతూ సముద్రం కోతకు గురవుతూ చివరికి జిల్లాకు పరిశ్రమలు రాకుండా పోతున్నాయి. మరోవైపు అభివృద్ధి పేరుతో సహజ సంపదకు నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంపద దోపిడీపై పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఎంతగా ఆందోళనవ్యక్తం చేసినా లాభం లేకుండా పోతోంది. తీర ప్రాంతాల్లో కడలి కన్నెర్రను అరచేత్తో అడ్డుకొనే మడ అడవులు నెల్లూరు జిల్లా తీరంలో కనుమరుగైపోయాయి. ఇప్పటికే తీరం వెంబడి వెలసిన పరిశ్రమల కర్కశం వల్ల మడ అడవులు తుడిచి పెట్టుకుపోయాయి. ఒకప్పుడు సముద్ర తీరం వెంబడి బకింగ్ హాం కెనాల్ను ఆనుకుని ఉండి సముద్రపు ఆటుపోట్లను అడ్డుకొంటూ సముద్రపు కోతను అరికట్టిన చెట్లు బూతద్దం పెట్టి వెతికిన కానరాని పరిస్థితి. భవిష్యత్తులో మడ చెట్లు పుస్తకాల్లో చదువుకొనె కథలుగా మిగిలిపోనున్నాయని జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నెల్లూరు జిల్లాలో సహజసిద్ధ సొన కాలువలు ఏర్పడ్డాయి. సముద్రతీర ఇసుక దిబ్బల్లో ఊరే నీరు... ఈ కాలువల్లో పడమర నుంచి తూర్పునకు ప్రవహిస్తోంది. ఎన్నో వేల ఎకరాల పంటలకు సాగునీటిని, గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నాయి. రెండు వందల ఏళ్ల క్రితంనాటి సొన కాలువలు పారిశ్రామిక పాదాల కింద స్వార్థపరులకు సంపదలుగా మారుతూ ఉనికిని కోల్పోతున్నాయి. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఈ మంచి నీటి నిక్షేపాల అస్తిత్వాన్ని పావు వంతు కబళించాయి. మిగిలినవాటినీ హరించేందుకు మరికొన్ని విద్యుత్, తోళ్ళ పరిశ్రమలు కాచుకుచ్చున్నాయి. వీటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.... ఎలాగైనా వీటిని అడ్డుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో లభించే ప్రఖ్యాతి గాంచిన మరో ప్రకృతి సంపద సిలికా. ఇసుక తరహాలో కనిపించే సిలికా ఖనిజం జిల్లాలోని చిల్లకూరు, కోట మండలాల్లో 10 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. భూమిపై పొరల్లో దాదాపు 20 మీటర్ల లోతు వరకు సహజంగా లభించే అరుదైన ఖనిజం ఇది. ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా సిలికా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ జాతీయంగా ఇటీవలి కాలంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సిలికాను కంప్యూటర్ చిప్ల తయారీ, గ్లాస్, మౌల్డింగ్, కాస్మొటిక్స్ పరిశ్రమల్లో వినియోగం ఎక్కువ కావటంతో నెల్లూరు జిల్లా నుంచి భారీగా తరలిపోతోంది. సిలికా తవ్వకాలకు పెద్దగా ఖర్చు ఉండకపోవడంతో తమిళనాడు, కర్ణాటకలతో పాటు ఇతర రాష్ట్రాలకు నిత్యం వందకుపైగా లారీల్లో తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఓడరేవుల ద్వారా ఇతర దేశాలకు చేరవేస్తున్నారని, అధికారులు స్పందించి అడ్డుకోకుంటే విలువైన తెల్ల బంగారం కాలగర్బంలో కలిసిపోతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









