పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు

- October 15, 2016 , by Maagulf
పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు

పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలున్నట్లు 'డాన్' పత్రికలో వచ్చిన కథనం తీవ్ర స్థాయిలో అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం కార్ప్స్ కమాండర్ల సమావేశం ముగిసిన తర్వాత సైన్యం నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి హెచ్చరిక సంకేతాలు పంపించింది. ఈ నెల 3న జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన రహస్య వివరాలను 'డాన్' ప్రతినిధి సిరిల్ అల్మీదాకు పీఎంఓలో ఉన్నవారే ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి ఎవరో 5 రోజుల్లోగా బయటపెట్టాలని స్పష్టం చేసింది. అదే సమయంలో 'డాన్' కథనం కల్పితమని, తప్పు అని ప్రకటించింది. ఈ కథనం దేశ భద్రతకు ప్రమాదకరమని చెప్తున్న సైన్యం... తప్పుడు సమాచారం వల్ల ఏ విధంగా హాని జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది.ఈ నేపథ్యంలోనే పాక్ పీఎంఓ సిరిల్ అల్మీదాను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌లో పెట్టింది. దీనిపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. సిరిల్ అల్మీదా రాసిన కథనంలో అత్యంత సూక్ష్మమైన వివరాలు ఉన్నాయి. వాటిని ఆ పత్రిక సంపాదకుడు కూడా సమర్థించారు.
తాము మళ్ళీ మళ్ళీ సరిచూసుకొని ఈ కథనాన్ని ప్రచురించామని స్పష్టం చేశారు. అయితే ఈ కథనం నవాజ్ షరీఫ్‌కు ఆయన సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్‌కు అనుకూలంగా, సైన్యానికి వ్యతిరేకంగా ఉందని ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ మండిపడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ ఉగ్రవాదులను కటకటాల్లోకి నెట్టే యోధులుగా ఈ కథనంలో చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com