చెత్త దహనం వల్ల రంగు మారుతున్న తాజ్‌మహల్‌..

- October 16, 2016 , by Maagulf
చెత్త దహనం వల్ల రంగు మారుతున్న తాజ్‌మహల్‌..

ఆగ్రా నగరంలో మున్సిపల్ వ్యర్ధాలు, ఆవుపేడతో తయారు చేసిన పిడకలను దహనం చేస్తుండటం వల్ల పురాతన కట్టడమైన తాజ్‌మహల్ రంగు మారుతుందని ఇండో అమెరికన్ పరిశోధకుల బృందం జరిపిన పరిశోధనలో తేలింది. అమెరికాలోని జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి రాజ్ లాల్, మిన్నేసోట యూనివర్శిటీకి చెందిన అజయ్ నాగ్ పురే లు కలిసి అధునాతన పద్ధతుల్లో జరిపిన శాస్త్రీయ పరిశోధనల్లో ఘనపు వ్యర్థాలను దహనం చేయడం వల్ల గాలిలో నలుసు పదార్థం మోతాదు పెరిగి అపురూపమైన తాజ్ మహల్ రూపును మారుస్తుందని వెల్లడైంది. దీనివల్ల ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ రంగు మారటమే కాకుండా ఆగ్రా నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెప్పారు.మున్సిపల్ ఘన వ్యర్ధాలను దహనం చేయడం వల్ల తాజ్‌మహల్ ఉపరితలంపై నలుసు పదార్థాలు పేరుకుపోతున్నాయని తేల్చారు. ఆవుపేడతో తయారు చేసిన పిడకలను వంటచెరకుగా వాడటం వల్ల పురాతన భవనాలు పొగచూరి పోవడంతోపాటు గాలి కలుషితమై ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని మిన్నెసోట, ఖరగ్ పూర్ ఐఐటీలకు చెందిన సచ్చిదా త్రిపాఠి, అనూ రామస్వామిలు చెప్పారు. 1632వ సంవత్సరంలో అప్పటి మొఘల్ రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ పేరిట పాలరాతితో నిర్మించిన తాజ్‌మహల్ రూపు మారకుండా ఉండాలంటే ఈ కాంప్లెక్సు సమీపంలోకి వాహనాల రాకపోకలను నిషేధించాలని పరిశోధకులు సూచించారు. ఇనుప పౌండ్రీలు, కాలుష్యవాయువులను విడుదల చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా నిషేధించాలని పరిశోధకులు సలహా ఇచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com