రంగయ్య తెలివి

- August 21, 2015 , by Maagulf
రంగయ్య తెలివి

ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. పక్కనే సాంబయ్య అనే మరో రైతు ఉండేవాడు. అతని ఇంట్లో చాలా కోళ్లు ఉండేవి. అవన్నీ రంగయ్య పెరట్లోకి వచ్చి రంగయ్య భార్య ఎండబెట్టిన తిండి గింజలు, వాళ్లు పెంచుకున్న మొక్కలూ తిన్నంత తిని మిగతావి వాటి కిష్టమొచ్చినట్లు తొక్కేసి వెళ్లేవి. చాలా సార్లు ఈ విషయం రంగయ్య, సాంబయ్యకి చెప్పినా ఆవేమైనా మనుషులా? మనం చెప్పినట్లు వినడానికి. కోళ్లు కదా మనం చెప్పినా వినవు రంగయ్యా..అని నవ్వేసి నిర్లక్ష్యంగా వెళ్లి పోయేవాడు. ఈ చర్యకు పాపం రంగయ్య చాలా విస్తుపోయేవాడు. ఒకరోజు సాంబయ్య పనిమీద పొరుగూరికి వెళ్లాడు. వచ్చి చూసేసరికి రంగయ్య పెరట్లో గుడ్లను ఏరుకుంటూ కనిపించాడు. అది చూసిన సాంబయ్య ఏంటి రంగయ్యా నీకు కోళ్లు లేవు కదా! ఈ గుడ్లు ఎక్కడివి? అని అడిగాడు. అందుకు రంగయ్య ఇందాకే నీ కోళ్లు వచ్చి మేసి వెళ్ళాయి. బహుశా అవి పెట్టిన గుడ్లే అయ్యుంటాయి అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. అంతే సాంబయ్య తన కోళ్లు రోజూ రంగయ్య ఇంట్లో గుడ్లు పెట్టేస్తున్నట్లున్నాయి అనుకుని అప్పట్నుంచీ తన కోళ్లను రంగయ్య పెరట్లోకి పోనియ్యకుండా తన పెరట్లోనే మేపుకునేవాడు. నిజానికి ఇదంతా రంగయ్య పన్నిన ఉపాయం. కానీ ఇది నిజం అనుకుని సాంబయ్య భలే నమ్మేశాడు. అంతేమరి మంచిగా మాటలతో చెబితే వినలేదు. గొడవ పెట్టుకుంటే పొరుగింటివాడు బాగోదు. అందుకే సున్నితంగా రంగయ్య భలే ఉపాయం పన్నాడు. తను అనుకున్నది సాధించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com