రాజు కల నెరవేర్చిన మంత్రి

- August 23, 2015 , by Maagulf
రాజు కల నెరవేర్చిన మంత్రి

విజయ నగర సామ్రాజ్యాధిపతి అయిన కృష్ణదేవరాయలకు ఒక రోజు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఒక అందమైన భవనం గాలిలో వేలాడుతూ కనిపించింది. ఆ భవనం విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతూ ఎగురుతూ కనిపించింది. ఆహా! ఎంత అద్భుతంగా ఉందీ భవనం. దీన్ని ఎలా నిర్మించారా? అని ఆరా తీయాలనుకునే లోపు మెలకువ వచ్చి కల చెదిరిపోయింది. వెంటనే రాజు లేచి రాజసభకు వెళ్లి అక్కడ తన మంత్రులతో ఆరా తీసి అలాంటి భవనం నిర్మించాలని అందుకు తగిన ఇంజనీర్లను పిలిపించమని ఆర్డర్‌ వేశాడు. మంత్రులు తలలు పీక్కునేలా ఆలోచించారు కానీ అలాంటి భవనం ఎక్కడా లేదనీ, కట్టే ఇంజనీర్లు కూడా లేరనీ తెలిపారు. ఎంతకీ రాజు తన మూర్ఖత్వాన్ని వదలకపోవడంతో మంత్రులకు ఏం చేయాలో తోచలేదు. ఒకరోజు రాజసభలోకి మాసిన బట్టలతో, చిందరవందర జుట్టు, గెడ్డంతో వంగిపోయిన నడుముతో ఒక పేద వృద్ధుడు వచ్చి, రాజా నాకు న్యాయం చేయాలి. నువ్వే న్యాయం చేయాలి. నా వంద వరహాలు చోరీకి గురయ్యాయి. వాటిని నాకు ఎలాగైనా తెచ్చిచ్చే బాధ్యత నీది మహాప్రభో అని శరణు వేడాడు. అందుకు రాజు ఆ వృద్ధుడితో బాధపడకు నీ వరహాలు ఎవరు దొంగిలించారో చెప్పు, వాటిని నేను తెచ్చిస్తాను అన్నాడు. అందుకు అతను భయపడుతూ.. రాజా నన్ను క్షమించాలి. అది మీరేనండీ.. అన్నాడు. అందుకు ఒకింత ఆశ్చర్యం, ఒకింత కోపంతో రాజు ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అడిగాడు. అదే ప్రభూ! కలలో మీరే దొంగిలించారు అన్నాడు. అప్పుడు రాజు అదేంటీ కలలో చూసింది నిజజీవితంలో ఎలా జరుగుతుంది అని అనగా రాజా! మరి నిజమే కదా కలలో చూసిన మాయా భవనం నిజంలో ఎలా నిర్మించగలం. ఇది మీకు తెలియాలనే నేనీ నాటకం ఆడాను. నన్ను క్షమించండి అనగా తన మూర్ఖత్వంతో మంత్రులను, ప్రజలను కష్టపెట్టినందుకు తనకు తానే సున్నితంగా నొచ్చుకున్నాడు రాజు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com