కొత్త జిల్లాల ఏర్పాటుతో పాస్పోర్టు సేవలకు అంతరాయం...
- November 01, 2016
తెలంగాణలో పాస్పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా పునర్విభజనతో ఎక్కడికి వెళ్లి పాస్పోర్టు తీసుకోవాలో తెలియక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొత్త జిల్లాలో పాస్పోర్టు సేవలకు సంబంధించిన వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే రెండు వారాల్లో సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో విదేశాలకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి దాదాపు నెలరోజులు కావస్తున్నా ఇంకా పాస్పోర్టు సంబంధిత సేవలు గాడిన పడక పోవడమే ఇందుకు కారణం. పాస్పోర్టు దరఖాస్తులను పాత జిల్లాల అధికారుల వద్దకు తీసుకువెళ్తే, కొత్త జిల్లాల అధికారుల వద్దకు వెళ్లాలని చెబుతున్నారు.
అక్కడికి వెళ్తే ఇంకా సాఫ్ట్వేర్, హార్ట్వేర్ రాలేదని మరో రెండు వారాలు పడుతుందని చెబుతున్నారు. మధ్యలో విదేశాలకు వెళ్లాల్సిన ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది గల్ఫ్లో ఉపాధి అవకాశాలను కూడా కోల్పోతున్నారు. ఇటీవల రెండు జిల్లాల ఎస్పీలు ఎండార్స్ చేసి పంపించిన కొత్త జిల్లాల నుంచి దరఖాస్తు రాలేదన్న కారణంతో పాస్పోర్టును తిరస్కరించిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
సాధారణంగా పాస్పోర్టులకు సంబంధించిన నివేదికను ఎస్పీలు ఆన్లైన్లోనే పంపించాలి. సంబంధిత సాఫ్ట్వేర్ రాకపోవడంతో కొత్త జిల్లాల ఎస్పీలు రిపోర్టులు పంపించలేకపోతున్నారు. పాత జిల్లాల ఎస్పీలు తమకు సంబంధం లేదంటున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కొత్త జిల్లాల ఎస్పీలకు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అందలేదు.
అది వస్తే తప్పితే ఆన్లైన్లోనే పాస్పోర్టు దరఖాస్తులను పరిష్కరించడం సాధ్యంకాదు. ఇప్పుడు పాత జిల్లాల పేరుతోనే వస్తోన్న సాఫ్ట్వేర్తో కొత్త జిల్లాల పరిధిని ఎలా తేల్చాలన్న గందరగోళంలో విచారణ చేపట్టే పోలీసు అధికారులు ఉన్నారు. అయితే న్యూఢిల్లీ నుంచి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండు వారాల్లో అందుతుందని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అంటున్నారు.
జిల్లాలు చిన్నగా మారడంతో విచారణ ఒక్కరోజులోనే పూర్తై అదే రోజు ఎస్పీ ఆమోదంతో పాస్పోర్టు కార్యాలయానికి అప్లోడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కొత్త జిల్లాల్లో పాస్పోర్టు సేవలు గాడిన పడితే జారీ వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







