ఘనంగా జరిగిన తెలంగాణ దీక్షా దివస్‌

- November 29, 2016 , by Maagulf
ఘనంగా జరిగిన తెలంగాణ దీక్షా దివస్‌

తెలంగాణలో దీక్షా దివస్‌ ఘనంగా జరిగింది. ఉద్యమం సందర్భంగా కేసీఆర్‌ దీక్ష చేపట్టి ఏడేళ్లు పూర్తి కావడంతో టీఆర్‌ఎస్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీక్షా దివస్‌ సందర్భంగా అమరు వీరుల త్యాగాలను స్మరించుకొని వారికి నివాళులర్పించారు. బంగారు తెలంగాణ సాధించేందుకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. 

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్ చిత్రపటానికి ఎంపీలు కేకే, కవిత, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్, సుమన్‌తో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారికి ఎంపీలు నివాళులర్పించారు. 

సిద్దపేట జిల్లా కేంద్రంలో దీక్షా దివస్‌ సందర్భంగా అమరవీరులకు మంత్రి హరీష్‌రావు నివాళులర్పించారు. తన దీక్షతో ఢిల్లీ పునాదులు కదిలించిన కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు హరీష్‌. తెలంగాణ కోసం చేసిన ఆ దీక్ష చరిత్రలో నిలిచిపోయిందన్నారు మంత్రి హరీష్‌రావు. ఇక బంగారు తెలంగాణను సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

హైదరాబాద్‌ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దీక్షా దివస్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారని నాయిని నర్సింహారెడ్డి గుర్తు చేశారు. పేదల అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడక్కడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com