150 మృతదేహాల కోసం తెలుగుప్రజల ఎదురుచూపు..

- December 11, 2016 , by Maagulf
150 మృతదేహాల కోసం తెలుగుప్రజల ఎదురుచూపు..

 సౌదీ అరేబియాలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 మంది కార్మికుల మృతదేహాలు ఏడాది కాలంగా మార్చూరీల్లోనే మగ్గుతున్నాయి. దీంతో వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మృతులను కడచూపునకు నోచుకోక ఆవేదన చెందుతున్నారు. మృతులకు అంత్యక్రియలు చేయడం కోసం వారు కళ్లల్లో వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకొని సౌదీ అరేబియా వెళ్లిన మన తెలుగు కార్మికుల్లో 150 మంది అనారోగ్యం, ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల కారణాల వల్ల మృత్యువాత పడ్డారు.

వారి మృతదేహాలు ఏడాది దాటినా ఇంకా స్వదేశానికి రాలేదు. మార్చూరీల్లోని మృతదేహాలను స్వదేశానికి తరలించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖాదికారులు రియాద్ లోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. మృతదేహాలను పంపించమని రాయబార కార్యాలయం సౌదీలో పనిచేసిన పరిశ్రమల యజమానులకు ఈమెయిల్స్ పెట్టినా, ఫోన్లు చేసినా వారినుంచి స్పందన కొరవడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పదిలక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుండగా వారు అక్కడ మరణిస్తే వారి మృతదేహాలు స్వదేశానికి తీసుకురావాలంటే ఏళ్ల తరబడిగా వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రమాదాల్లో మరణిస్తే వారి మృతదేహాలు స్వదేశానికి తీసుకురావాలంటే కనీసం 40 రోజుల సమయం పడుతుంది. సౌదీ నుంచి ఒక మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలంటే కనీసం 4 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చుఅవుతుందని, అంత డబ్బు వెచ్చించి మృతదేహాన్ని పంపించేందుకు సౌదీలు ముందుకురావడం లేదని ప్రవాస భారతీయ కార్మిక సంఘాల నాయకుడు మంద భీంరెడ్డి చెప్పారు. భారత రాయబార కార్యాలయం అధికారులు సౌదీ పోలీసులు, పరిశ్రమల యజమానులతో మాట్లాడి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంద భీంరెడ్డి కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com