దలై లామా, ప్రణబ్ ముఖర్జీ సమావేశమవడంపై నిరసన వ్యక్తం చేసిన చైనా

- December 16, 2016 , by Maagulf
దలై లామా,  ప్రణబ్ ముఖర్జీ సమావేశమవడంపై నిరసన వ్యక్తం చేసిన చైనా

నాతో స్నేహం కావాలంటే నా శత్రువుకు ఆతిథ్యం ఇవ్వవద్దనడం న్యాయమేనా? చైనా ఆ విదంగానే మాట్లాడుతోంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమావేశమవడంపై చైనా నిరసన వ్యక్తం చేస్తోంది. ద్వైపాక్సిక సంబంధాల్లో కలతలు రాకుండా నివారించేందుకు చైనాకుగల ప్రాథమిక ప్రయోజనాలను భారతదేశం తప్పనిసరిగా గౌరవించాలని పేర్కొంది. దలైలామా, ప్రణబ్ సమావేశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ మీడియాతో మాట్లాడుతూ ''చైనా చేసిన మర్యాదపూర్వకమైన విజ్ఞప్తిని, స్పష్టమైన అభ్యంతరాలను పక్కనబెట్టి, భారతదేశం ఇటీవల భారతదేశ రాష్ట్రపతి భవన్‌ను 14వ దలైలామా సందర్శించేందుకు ఏర్పాటు చేసింది.

దీంతో చైనా తీవ్రంగా అసంతృప్తికి గురైంది, దీనిని దృఢంగా వ్యతిరేకిస్తోంది '' అని పేర్కొన్నారు. ''దలైలామా రాజకీయ ప్రవాసంలో ఉన్నారు. చాలా కాలం నుంచి మతం ప్రాతిపదికగా చైనా నుంచి టిబెట్‌ను వేరు చేయాలని ప్రయత్నిస్తూ చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు'' అని చెప్పారు. దలై లామా ముఠా స్వభావాన్ని, చైనా వ్యతిరేకతను గుర్తించి, చైనా ప్రయోజనాలను గౌరవించాలని భారతదేశానికి తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల్లో కలతలు ఏర్పడకుండా జాగ్రత్తవహించాలన్నారు. నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఆధ్వర్యంలోని బాలల ఫౌండేషన్ ఈ నెల 10న నిర్వహించిన బాలల సదస్సులో దలై లామా పాల్గొన్న సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com