నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ..

- December 21, 2016 , by Maagulf
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ..

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పది రోజుల శీతాకాల విడిది కోసం గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 31 వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా..గురువారం సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రపతి దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు.

రాష్ట్రపతి హాజరయ్యే కార్యక్రమాలివే: 
ఈ నెల 23న సికింద్రాబాద్‌లోని ఆర్మీ దంతవైద్య కళాశాలలో బీడీఎస్‌, ఎండీఎస్‌ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు.

అదే రోజు తెలంగాణ, ఏపీ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు. 24న హైదరాబాద్‌లో మహిళాదక్షత సమితి, బన్సీలాల్‌ మాలాని నర్సింగ్‌ కళాశాలను ప్రారంభిస్తారు. 25న బెంగళూరు వెళ్లి..అక్కడి నిఖిల్‌ భారత్‌ బంగ సాహిత్య సమ్మేళనం 89వ వార్షిక మహాసభలో పాల్గొంటారు. అదేరోజు హైదరాబాద్‌కు తిరిగొస్తారు. 26న హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. డిసెంబరు 29న తిరువనంతపురంలో ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ 77వ సదస్సును, అటు తర్వాత మైసూరులో భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ 17వ జాతీయ వినోద సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. 30న బెంగళూరులో శ్రీశంకర జాతీయ క్యాన్సర్‌ నివారణ, పరిశోధన సంస్థ, ఆదమ్య చేతన సేవా ఉత్సవ్‌-2017ని ప్రారంభిస్తారు. డిసెంబరు 30న రాష్ట్రపతి నిలయంలో జరిగే గవర్నర్‌, సీఎం, ఇతర ప్రముఖుల తేనీటి విందుకు హాజరవుతారు. 31న సాయంత్రం దిల్లీకి బయల్దేరి వెళ్లారు.

రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ 
రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు.
పకడ్బందీ ఏర్పాట్లు 
రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతి నిలయానికి భద్రత పెంచడంతోపాటు..బొల్లారం ప్రాంతంలో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com