రైల్వే శాఖ సంచలన నిర్ణయం..

- December 23, 2016 , by Maagulf
రైల్వే శాఖ సంచలన నిర్ణయం..

నవంబర్‌లో కాన్పూర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో... ప్రయాణికులకు భరోసానిస్తూ భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రమాద బాధితులకు అందించే పరిహారంపై దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సవరణలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు, బాధితులకు అందించే పరిహారాన్ని రెండింతలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన సవరణలు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇకపై రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటి వరకు అందిస్తున్న రూ.4 లక్షలకు బదులు రూ.8 లక్షలు పరిహారం అందిస్తారు. తీవ్రంగా గాయపడి కాలు, చెయ్యి వంటి శరీర అవయువాలను కోల్పోయిన వారికి, కంటి చూపు, వినికిడిశక్తి కోల్పోయిన వారికి కూడా రూ.4 స్థానంలో రూ.8 లక్షలు పరిహారం చెల్లిస్తారు.

అలాగే ఇతర 34 రకాల గాయాలకు ప్రస్తుతమున్న దానికంటే రెట్టింపు మొత్తంలో రూ.7.2 లక్షల నుంచి రూ.64 వేల వరకు అందిస్తారు. ఈ మేరకు 'రైల్వే ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనల (పరిహారం) నిబంధనలు -1997'కు సవరణ చేసింది. చివరిసారిగా 1997లో పరిహారాలను సవరించిన రైల్వే శాఖ మళ్లీ 19 ఏళ్ల తర్వాత... కాన్పూర్ రైల్వే ప్రమాద దుర్ఘటనతో ఈ నిర్ణయం తీసుకుంది.

నవంబర్‌లో జరిగిన కాన్పూర్ రైల్వే ప్రమాదంలో 143 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కాగా 1997 తర్వాత మళ్లీ ఇప్పటి వరకు పరిహారాలను పెంచలేదనీ... వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల బోంబే హైకోర్టు ఆదేశించింది. దేశంలో తరచూ రైల్వే ప్రమాదాలు జరుగుతుండడంతో గతేడాది ఢిల్లీ హైకోర్టు సైతం పరిహారాలను పెంచాలంటూ రైల్వే శాఖను ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com