కువైట్ ఆస్పత్రిలో చెన్నై వాసి: అండగా నిల్చిన టిడిపి నేతలు

- December 25, 2016 , by Maagulf

విమానంలో అమెరికా వెళుతున్న సమయంలో ఓ భారతీయునికి అస్వస్థత కలగడంతో విమాన సిబ్బంది.. కువైట్‌లో చికిత్స కోసం దింపేశారు. కాగా, విషయం తెలుసుకున్న తెలుగుదేశం కువైట్ శాఖ నేతలు వారికి అండగా నిలిచారు.
వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన కస్తూరి రంగన్(70), లీలారంగన్ అనే దంపతులు తమ కుమారుడుని చూడటానికి అమెరికాకు కువైట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణమయ్యారు. ఈ విమానం కువైట్ మీదుగా అమెరికా వెళ్తోంది. కువైట్‌లో ట్రాన్సిట్ సమయంలో కస్తూరి రంగన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇది గమనించిన విమాన సిబ్బంది హుటాహుటిన కువైట్ ఏయిర్ పోర్ట్ అథారిటీ వారికి విషయాన్ని తెలియజేసి ఆయనను మెరుగైన చికిత్స కోసం కువైట్‌లోనే దించి వేశారు.అనంతరం కువైట్‌లోని ఫర్వానియా సూపర్ స్పెషాలిటీలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు .. తెలుగు సోషల్ వెల్ఫేర్ జిలకర మురళి, రవికుమార్‌కు తెలియజేశారు. వారికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. దీంతో మురళి, రవికుమార్, జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రాంమోహన్‌లు ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అమెరికాలో ఉన్న వారి కొడుకుకు సమాచారం అందించి ఎప్పటికప్పుడు విషయాలను తెలుపుతున్నారు. రంగన్ కుమారుడు కూడా ఉన్నఫలంగా కువైట్ బయల్దేరారు. సోమవారం వరకు ఆయన కువైట్ చేరుకుంటారు.
అలాగే ఇండియాలో ఉన్న మరో కొడుకు, కోడలు కూడా కువైట్ వచ్చేందుకు వీసా ఏర్పాట్లు చేస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం లీలారంగన్‌ను ఓ తమిళ ఫ్యామిలీ వారు తమతో ఉంచుకుని వారి బాగోగులు చూసుకుంటున్నారు.
ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న కస్తూరి రంగన్‌ను కుదరవల్లి సుధాకర్ సందర్శించారు. సంబంధిత డాక్టర్లని సంప్రదించగా కస్తూరి రంగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా ఇంకా వెంటిలేటర్ మీదనే ఉంచామని వైద్యులు తెలిపారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com