ఐటీ దాడుల్లో భారీగా బయటపడుతున్న నల్లధనం,పసిడి

- December 25, 2016 , by Maagulf
ఐటీ దాడుల్లో భారీగా బయటపడుతున్న నల్లధనం,పసిడి

డిసెంబర్‌ 30 సమీపించే కొద్దీ నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చుకునే ప్రయత్నంలో దొరికిపోతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో గుట్టలకొద్దీ నోట్లకట్టలు, కేజీల కొద్దీ బంగారం పట్టుబడ్డాయి.
డిసెంబర్‌ 30 సమీపించే కొద్దీ బ్లాక్‌ను వైట్‌ చేసుకునే ప్రయత్నాలు వేగం  పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో పలుచోట్ల ఐటీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడింది.  
దేశరాజధాని ఢిల్లీలో శ్రీ లాల్‌ మహల్‌ లిమిటెడ్‌ కమొడిటీ ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్యం నివాసాలు, కార్యాలయాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ జరిపిన దాడుల్లో సుమారు 430 కేజీల బంగారం పట్టుబడింది. దీని విలువ సుమారు 120 కోట్లు. ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ, నొయిడా ప్రాంతాల్లో జరిపిన ఈ దాడుల్లో బంగారంతో పాటు 2.48కోట్ల విలువైన పాతనోట్లను, రూ.12 లక్షల విలువైన కొత్త నోట్లు పట్టుబడ్డాయి.  
ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్ధతిలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని అక్రమంగా తరలించి ఈ సొమ్మును కూడబెట్టారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఈ సంస్థ కార్యాలయాల నుంచి భారీ ఎత్తున ఆన్‌లైన్‌ లావాదేవీలు  జరిగినట్లు గుర్తించారు. రద్దయిన పాతనోట్లతో పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేరళలో హవాలా రాకెట్‌ను ఛేదించిన పోలీసులు 39.98 లక్షల విలువజేసే కొత్త 2 వేల నోట్లను సీజ్ చేశారు. ఇప్పటికే హవాలా కేసు ఎదుర్కొంటున్న స్థానిక వ్యాపారి షాబీర్ బాబు నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఆలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. అటు మధ్యప్రదేశ్‌లోని 500  జన్ ధన్ ఖాతాల్లో వంద కోట్లకు పైగా డబ్బు జమ చేసినట్లు గుర్తించారు. కోటి కంటే ఎక్కువ జమైన మరో 500 ఖాతాలపై నిఘా పెట్టారు. బీహార్‌, జార్ఖండ్‌లలో సైతం సుమారు 600 జన్‌ధన్‌ ఖాతాల్లో 10 కోట్ల నగదు జమ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com