ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ వీరే....

- January 04, 2017 , by Maagulf
ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ వీరే....

సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. దోపిడీదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుల్బర్గా వరకు స్కార్పియో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులకు అక్కడ లింక్ తెగిపోయింది. అయితే రామచంద్రాపురం నుంచి శంకర్ పల్లి మీదుగా గుల్బర్గా వెళ్లినట్లు మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ క్లూ ఆధారంగా గుల్బర్గా వరకున్న సెల్ టవర్ల పరిధిలోని కాల్స్‌ను ట్రేస్ చేశారు. ఎక్కువగా కాల్స్ వెళ్లిన నెంబర్ల ఆధారంగా ఆరా తీశారు. మరోవైపు వారు వాడిన టిఫిన్ బాక్సులపై వేలి ముద్రలను గుర్తించారు. ఆ వేలి ముద్రలను ఆధార్‌ రికార్డుల్లో పరిశీలించగా అసలు విషయం బయటపడినట్లు చెబుతున్నారు. 

సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలోకి సీబీఐ అధికారులమంటూ వచ్చి పట్టపగలే ఆరుగురు దుండగులు 13 కోట్ల రూపాయల విలువ చేసే 46 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది ఆ సమయంలో వివరాలు ఇచ్చారు. తమను  గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. అయితే, అదే రోజు సాయంత్రంలోగా వారు వెళుతున్న వాహనం ఆధారాలు గుర్తించిన పోలీసులు అనంతరం వారి ఊహాచిత్రాలు కూడా విడుదల చేసి విస్తృతంగా గాలించారు. తాజాగా కర్ణాటకలోని గుల్బార్గాలో అదుపులోకి తీసుకొని ఆ ముఠా మొత్తాన్ని హైదరాబాద్‌కు తరలించారు. వీరిని ప్రస్తుతం సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య విచారిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com