వాట్సాప్‌ 'ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌'లో లోపం

- January 15, 2017 , by Maagulf
వాట్సాప్‌ 'ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌'లో లోపం

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'వాట్సాప్‌'లో ప్రవేశపెట్టిన ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌లో లోపం ఉందని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత తమ ఉద్యోగులు సైతం వినియోగదారుల మెసేజ్‌లను చదివే వీలుండదని వాట్సాప్‌ ఇప్పటివరకూ చెబుతూ వచ్చింది. దాంతో వినియోగదారుల భద్రతకు ఢోకా ఉండదని తెలిపింది. కానీ.. అందులో వాస్తవం లేదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన సెక్యూరిటీ పరిశోధకుడు తోబియాస్‌ బోఎల్టర్‌ అంటున్నారు. ఎన్‌క్రిప్షన్‌లో వినియోగించే సెక్యూరిటీ 'కీ'లో మార్పులు చేసి మూడో వ్యక్తి మెసేజ్‌లను చదివే వీలుంటుందని చెబుతున్నారు.

ఎదుటి వ్యక్తి ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మెసేజ్‌లను పంపితే.. ఆ మెసేజ్‌లకు సంబంధించిన సెక్యూరిటీ 'కీ'లను వాట్సాప్‌ సిబ్బంది మార్చేసే వీలుందట. అలా మార్చిన విషయం మెసేజ్‌ను పంపిన వ్యక్తికి.. రిసీవ్‌ చేసుకోవాల్సిన వ్యక్తికీ తెలియదట. అలాంటి సందర్భాల్లో మూడో వ్యక్తి ఆ మెసేజ్‌లను చదివే వీలుంటుందని తొబియాస్‌ అంటున్నారు. అలా సమాచార మార్పిడిపై నిఘా పెట్టడం వినియోగదారుడి వాక్‌ స్వాతంత్య్రాన్ని దెబ్బతీయడమేనని ఆరోపిస్తున్నారు. ఈ సెక్యూరిటీ లోపానికి సంబంధించిన విషయాలను ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ది గార్డియన్‌' ద్వారా ఆయన బయటపెట్టారు.

అయితే.. అలా మెసేజ్‌లను మూడో వ్యక్తి చదవడం అరుదుగా ఉంటుందని వాట్సాప్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. వినియోగదారులు ఫోన్లు మార్చినప్పుడు.. వాట్సాప్‌ను రీ-ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. అందరూ వాట్సాప్‌లో ఉన్న సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోని ''షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్‌'ను ఆన్‌లో ఉంచుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com