శీతల పానీయాలు బంద్‌ మార్చి 1 నుంచి..

- January 25, 2017 , by Maagulf
శీతల పానీయాలు బంద్‌ మార్చి 1 నుంచి..

మార్చి ఒకటో తేదీ నుంచి బహుళజాతి సంస్థలు తయారు చేసిన శీతల పానీయాలు, మంచినీళ్ల సీసాలను విక్రయించే ప్రసక్తే లేదని తమిళనాడు విక్రయదారుల సంఘం 'పెరమైపు' ప్రకటించింది. ఫిబ్రవరి నెలంతా పానీయాల ప్రభావం గురించి వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని సంస్థ అధ్యక్షుడు ఏఎం విక్రమరాజా తెలిపారు. దేశీయ తయారీ పానీయాలను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. ఎంఎన్‌సీ తయారు చేసిన పానీయాల్లో పిల్లలకు హాని కలిగించే పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటున్నాయన్నారు.
6వేల అనుబంధ సంఘాలు, 15.87లక్షల సభ్యులు కలిగిన 'పెరమైపు' 1998 నుంచి కిన్లే, పెప్సికో ఉత్పత్తులకు వ్యతిరేకంగా పోరాడుతోంది.

అయితే వినియోగదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో సత్ఫలితాలను సాధించలేకపోయింది.
జల్లికట్టు సంప్రదాయం కోసం యువత చేపట్టిన శాంతియుత పోరాటం స్ఫూర్తిగా.. ఇక్కడి వనరులను ఉపయోగించుకుని కోట్లు కొల్లగొడుతున్న ఎంఎన్‌సీ ఉత్పత్తులను అడ్డుకోవడానికి కార్యాచరణ చేపడుతున్నట్లు విక్రమరాజా ప్రకటించారు. రెస్టారెంట్లు, హోటల్స్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
మే 5న వార్షిక సమావేశం 
వచ్చే మే 5న వార్షిక సమావేశం నిర్వహించాలని విల్లుపురంలో జరిగిన సాధారణ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విక్రమరాజా చెప్పారు. పాల ఉత్పత్తులను అందించే ఎంఎన్‌సీ సంస్థలకు పాలను సరఫరా చేసేది లేదని తమిళనాడు పాల సరఫరాదారుల, ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఎస్‌ఏ పొన్నుస్వామి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com