75 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం

- February 01, 2017 , by Maagulf
75 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం

విరాట్‌కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. ఓటమితో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఆరంభించినా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకొంది. చిన్నస్వామి మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 75 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. యువ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ (6/25), జస్ప్రీత్‌ బుమ్రా (3/14) అద్భుత గణాంకాలు నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 203 పరుగుల లక్ష్యం నిర్దేశించగా ఇంగ్లిష్‌ జట్టు 16.3 ఓవర్లకు 127 పరుగులకే కుప్పకూలింది.


జేసన్‌రాయ్‌ (32), జోరూట్‌ (42), ఇయాన్‌ మోర్గాన్‌ (40) మాత్రమే రాణించారు. చాహల్‌ స్పిన్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ 119 పరుగుల వద్ద మూడు వికెట్లు, 127 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అమిత్‌ మిశ్రా ఒక వికెట్‌ పడగొట్టాడు
రైనా, ధోనీ అర్ధశతకాలు 
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 4 పరుగుల వద్దే విరాట్‌కోహ్లీ (2) వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సురేశ్‌ రైనా (63; 45 బంతుల్లో 2×4, 5×6) ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (22; 18 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి చెలరేగాడు. వరుసగా సిక్సర్లు, బౌండరీలు బాదాడు. 65 పరుగుల వద్ద లోకేశ్‌ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (56; 36 బంతుల్లో 5×4, 2×6) కెరీర్‌లో తొలి అర్ధశతకం బాదాడు. చక్కని షాట్లతో అలరించాడు.
యువీ సిక్సర్ల హోరు 
రైనా తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్‌సింగ్‌ (27; 10 బంతుల్లో 1×4, 3×6) ) ఇంగ్లాండ్‌కు మళ్లీ తన సిక్సర్ల రుచి చూపించాడు. క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6,6,4,6,1 పరుగులు రాబట్టాడు. యువీ సిక్సర్ల హోరు చూసి జోర్డాన్‌ తలపట్టుకొన్నాడు. ఐతే ఆ తర్వాత ఓవర్‌లో తైమల్‌ మిల్స్‌ వేసిన తొలి బంతిని అంచనా వేయలేకపోయిన యువీ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రిషబ్‌ పంత్‌ (5), హార్దిక్‌ పాండ్య (11) ఫర్వాలేదనిపించడంతో భారత్‌ 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com