ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపే అతిపెద్ద సాహసం చేస్తోంది ఇస్రో...

- February 12, 2017 , by Maagulf
ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపే అతిపెద్ద సాహసం చేస్తోంది ఇస్రో...

ఆర్యభట్ట నుంచి ఆస్ట్రో శాట్‌ వరకు ఎన్నో విజయాలు.. నాలుగున్నర దశాబ్దాల్లో మరెన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలు.. దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన ఇస్రో, ఇప్పుడు ప్రపంచానికే సవాల్‌ విసిరే రేంజ్‌కి ఎదిగింది. చంద్రయాన్‌, మంగళయాన్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. నింగిలో ఏముంది..? ఇది తెలుసుకోవడం ఒక పెద్ద సాహసం. ఈ సాహస యాత్రలో దిగ్విజయంగా ముందుకు వెళుతోంది ఇస్రో. ఎడ్లబళ్లపై రాకెట్లను మోసుకెళ్లిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు. ఆంక్షలు, హద్దులు, అడ్డంకులు, అంతరాయాలను అధిగమిస్తూ రోదసిలోకి దూసుకుపోతోంది. ప్రతి లక్ష్యం అడుగుతోనే మొదలవుతుంది.. తొలి అడుగులో పొరపాటు దొర్లినా, ఆ తర్వాత  ప్రతి అడుగూ విజయం దిశగానే నడిచాయి. ఒకటి పదయ్యాయి.. పది వందయ్యాయి.. ఇప్పుడు ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపే అతిపెద్ద సాహసం చేస్తోంది ఇస్రో.
రాకెట్‌ ప్రయోగం అంటే దేశం యావత్తు ఆసక్తిగా తిలకిస్తుంది. అసలు రాకెట్‌ ఎలా తయారు  చేస్తారు..? అందులో శాటిలైట్లను నింగికి ఎలా చేరుస్తారు..? ఇలాంటి విషయాలు తెలుసుకోవడం అంటే మరింత ఆసక్తి. అరకోటి లింగాల శ్రీహరికోటగా చారిత్రక ప్రసిద్ధి చెందిన షార్‌.. ఇప్పుడు రాకెట్‌ ప్రయోగాలకు రాచబాటగా వర్ధిల్లుతోంది. నాలుగు దశాబ్దాల కిందట కీకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలతో దేశానికే తలమానికంగా నిలుస్తోంది.
దేశం నలుమూలలా ఎన్నో అంతరిక్ష పరిశోధన కేంద్రాలు విస్తరించి ఉన్నా, వీటిలో ముఖ్యమైనది నెల్లూరు జిల్లాలోని షార్‌. భూమధ్య రేఖకు ఏటవాలుగా 13 డిగ్రీల కోణంలో శ్రీహరికోట ఉండటం, రాకెట్‌ ప్రయోగ దిశలో భూబాగాలు ఏమీ లేకపోవడం షార్‌కు కలిసొచ్చింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు రాకెట్‌ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా.. శ్రీహరికోట కేంద్రం రెండోస్థానంలో కొనసాగుతోంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల రాకెట్‌ భూమ్యాకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి, అంతరిక్షంలోకి అనుకున్న విధంగా రాకెట్‌ను పంపవచ్చు.
1980లో తొలి విజయాన్ని నమోదు చేసింది షార్‌. రోహిణి వన్‌ ఉపగ్రహ ప్రయోగం చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత 1987లో చేపట్టిన ఏఎస్‌ఎల్వీ ప్రయోగం విఫలమైంది. 1988లోనూ ఓటమి ఎదరురైంది. అయితే వైఫల్యాలు గుణపాఠాలు మార్చుకుని పరిశోధనల పరంపర కొనసాగించింది. 1992లో విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించింది. 1993లో పీఎస్‌ఎల్వీ ప్రయోగం విఫలమైనా, ఆ తర్వాత నుంచి ప్రతి ప్రయోగం సక్సెస్‌ బాటలోనే పయనించింది. ఇప్పుడు భారత ఉపగ్రహాలకు పీఎస్‌ఎల్వీ స్థిరమైన వేదికగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహాల సమూహానికి మూలమైనదిగా, రక్షణ, విద్యా, వ్యవసాయ, సాంకేతికలకు అవసరమైన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com