లైంగిక నేరగాళ్ళ వివరాలు అందరికీ తెలిసేలా కేరళలో కొత్త చట్టం

- February 23, 2017 , by Maagulf
లైంగిక నేరగాళ్ళ వివరాలు అందరికీ తెలిసేలా కేరళలో కొత్త చట్టం

మహిళలపై నేరాలు పెరుగుతున్నాయనే ఆందోళన తీవ్రమవుతోంది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చట్టాలను పటిష్ఠపరచడం, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు కేరళ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. దేశంలోనే తొలిసారిగా లైంగిక నేరగాళ్ళ జాబితాను తయారు చేసి, వారి వివరాలు అందరికీ తెలిసేలా చేయబోతోంది. గవర్నర్ జస్టిస్ (విశ్రాంత) పి సదాశివం గురువారం శాసనసభలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. కేరళలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలను జస్టిస్ సదాశివం వివరిస్తూ సెక్స్ నేరగాళ్ళకు సంబంధించిన గుర్తింపు వివరాలతో రిజిస్టర్‌ను తయారు చేస్తామన్నారు.

దానిని అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇటువంటి చర్య దేశంలోనే మొదటిదని తెలిపారు. లైంగిక నేరాల బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధిని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. సాంఘిక న్యాయ శాఖ ఆధ్వర్యంలోని నిర్భయ కేంద్రం పనితీరు బాగున్నప్పటికీ, బాధితులకు సాయం చేసేందుకు సమగ్ర నిధి లేదని తెలిపారు.

కొందరు బాధితులు ఆర్థిక సాయాన్ని పొందుతున్నప్పటికీ, వారు అనుభవించిన నష్టానికి తగిన పరిహారం అందడంలో జాప్యం జరుగుతుండటానికి కారణం నిధి లేకపోవడమేనని వివరించారు. సెక్స్ నేరాలు పెరుగుతుండటానికి కారణం సమాజపరమైన నిరోధం లేకపోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాలూకా స్థాయిలో అందరూ మహిళలే ఉండే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగా ప్రకటించిన తేదీన ప్రతి పంచాయతీకి పోలీసు అధికారిణి తప్పనిసరిగా వెళ్ళేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com