ఏపీ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం నేడే
- March 01, 2017
గుంటూరు (నల్లచెరువు)/తుళ్ళూరు: నూతన రాజధాని సచివాలయంలో నిర్మించిన శాసన సభా, శాసన మండలి భవనాలను నేడు సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారని కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల జిల్లా అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా అధికారులు అప్రమత్తతో ఉండాలన్నారు. పరిసర గ్రామాల నుంచి దాదాపు 10 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేశారు. కార్యక్రమానికి విచ్చేసే వారు ఉదయం 10 గంటల కల్లా సభా స్థలి వద్దకు చేరుకునేలా చూడాలన్నారు.
వారికి అవసరమైన తాగునీరు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం పూర్తి అయ్యే వరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవరోధం ఉండకూడదన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు తగినంత మంది సిబ్బందిని నియమించాలని పంచాయతీ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ -2 ఎం వెంకటేశ్వరరావు, డీఆర్వో నాగబాబు, పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, రాజధాని 29 గ్రామాల ప్రజా ప్రతినిధులకు, రైతులకు ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు.
ప్రారంభోత్సవం వద్ద ఆంక్షలు
రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్
గుంటూరు : భద్రతా కారణాల దృష్ట్యా గురువారం జరుగనున్న ఏపీ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం వద్ద ఆంక్షలు విధిస్తున్నట్లు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ చెప్పారు. సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించనున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రముఖుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని భవనాల్లోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు తెలిపారు. ఇందుకు మీడియా సహకరించాల్సిందిగా కోరారు. ఆయా భవనాల ప్రారంభోత్సవం, ఇతర దృశ్యాలను ఐఅండ్పీఆర్ విభాగం మీడియాకు విడుదల చేస్తుందన్నారు. బహిరంగ సభ వద్ద మాత్రం మీడియాకు ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.
అసెంబ్లీకి వైద్య బృందాలు
గుంటూరు (మెడికల్): వెలగపూడిలో నూతన అసెంబ్లీ ప్రారంభించిన నేపథ్యంలో మార్చి మొదటి వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే ప్రారంభం కానున్నాయి. మార్చి ఆరవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అసెంబ్లీ సెషన్ జరిగినన్ని రోజులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల నుంచి రోజూ రెండు షిప్టుల్లో ప్రత్యేక వైద్య బృందాలను పంపుతున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు తెలిపారు. ప్రతి వైద్య బృందంలో కార్డియాలజిస్ట్/జనరల్ ఫిజీషియన్, ఎనస్థటిస్ట్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టుతో పాటు పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. ఇందుకోసం వైద్యులకు ప్రత్యేక విధులు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







