మచిలీపట్నంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ లాజిస్థిక్ మాన్యుఫాక్టరింగ్ జోన్

- April 09, 2017 , by Maagulf
మచిలీపట్నంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ లాజిస్థిక్ మాన్యుఫాక్టరింగ్ జోన్

మచిలీపట్నంలో ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్ లాజిస్థిక్ మాన్యుఫాక్టరింగ్ జోన్ ఏర్పాటు కానుంది. పోర్టుకు దగ్గరగా నూతన విధానంలో అత్యాధునికంగా దీన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణాకు కూడా మచిలీపట్నం దగ్గరగా ఉండటం, ఇక్కడ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మచిలీపట్నం సమీపంలో 200 కిలోమీటర్ల పరిధిలో లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో సువిశాల వరి క్షేత్రాలున్నాయని, 21 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో సాగవతున్నవరి పంటకు వేలాది టన్నుల ఎరువలు అవసరమవతాయని, ఈ ఎరువుల దిగుమతికి, ఇక్కడ పండిన వరి పంట ఎగుమతులకు మచిలీపట్నం ఓడరేవు కీలకంగా మారుతుందని చెప్పారు.
రానున్న రోజుల్లో అమరావతి ఆర్ధిక కార్యక్రమాలు ఊపందుకోవడానికి కూడా ఇక్కడి పోర్టు ప్రముఖ పాత్ర వహిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కాంకర్ (కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సిఎండి వి కళ్యాణ రామ, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మాన్యుఫాక్టరింగ్ జోన్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. దేశీయ లాజిస్టిక్ రంగంలో ప్రసిద్ధి చెందిన కాంకర్ సంస్థ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ముందుకు రాగా, నిరుడు విశాఖ భాగస్వామ్య సదస్సులో అవగాహన ఒప్పందం కుదిరింది. 
ఇందులో భాగంగా ప్రతిపాదిత వెయ్యి ఎకరాల లాజిస్టిక్ జోన్లో 300 ఎకరాల్లో 200 కోట్ల రూపాయల పెట్టబడితో తొలుత లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనుంది. మచిలీపట్నంలో ప్రతిపాదిత సెజ్లో తయారీ రంగ పరిశ్రమలు, గిడ్డింగులు, అస్సెంబిల్డ్ తరహా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రైలు, రహదారి, నౌకాయానం.. మూడింటి కలయికతో ఏర్పాటయ్యే ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మాన్యుఫాక్టరింగ్ జోన్ తో మచిలీపట్నం మాత్రమే కాకుండా, రాజధాని ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.
కాంకర్ ఏర్పాటు చేయబోయే లాజిస్టిక్ పార్క్తో అగ్రి ప్రాసెసింగ్ ఆటోమొబైల్స్, ఫెర్డిలైజర్స్, ఆక్వా ప్రాసెసింగ్ నిత్యావసరాలు, గ్రానైట్ పరిశ్రమ, ఎలక్రానిక్స్, జ్యూయలరీ తరహా పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది.
మచిలీపట్నం రేవు అభివృధి, వ్యాపార వాణిజ్య కార్యక్రమాల విస్తరణ నిమిత్తం చేపట్టిన ఈ ప్రాజెక్టును దశలవారీగా, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని, ఇందుకు అనుమతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ భేటీలో పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ, మౌలిక వసతుల కల్పన ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రాజమౌళి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com