షిర్డీకి విమాన రాకపోకలు..షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త

- April 12, 2017 , by Maagulf
షిర్డీకి విమాన రాకపోకలు..షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త

సాయిబాబా భక్తులకు శుభవార్త. మే నెల నుంచి షిర్డీకి విమానాల రాకపోకలపై పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. షిర్డీ ఎయిర్‌పోర్టును మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ పూర్తిగా సన్నద్ధం చేస్తోంది. విమానాశ్రయం పనులు చివరి దశలో ఉన్నాయి. అహ్మద్‌నగర్ జిల్లాలో సిద్ధమవుతున్న ఈ  విమానాశ్రయమే ఎంఏడీసీ నిర్మించిన తొలి ఎయిర్‌పోర్ట్. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుతో పాటు దేశంలో పలు నగరాల నుంచి షిర్డీకి విమానాలు నడపనున్నారు. 2002లో ఎంఏడీసీని స్థాపించిన తరవాత నిర్మించిన తొలి ఎయిర్‌పోర్టు షిర్డీదే. మొదటగా షిర్డీకి దేశీయ విమానాలనే నడపనున్నారు. ఆ తరువాత రద్దీని బట్టి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది. మొదట రోజుకి నాలుగు నుంచి ఐదు విమానాలు నడపాలని నిర్ణయించారు. షిర్డీ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే 340 కోట్లు మంజూరు చేసింది. 
షిర్డీ సాయిబాబా మహాశతాబ్ది మహోత్సవాన్ని వైభవోపేతంగా జరపడానికి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ 18 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం 3వేల కోట్లు కేటాయించింది. ఈ ఉత్సవాలకు సాయిబాబా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు కాబట్టి వారికి ఎలాంటి  ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయలు కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే విమానాశ్రయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. రైళ్లు, బస్సుల్లో ప్రయాణానికి ఇబ్బంది పడే వారికి విమాన సర్వీసులతో మేలు జరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com