నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు

- April 20, 2017 , by Maagulf
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు

  ఏపీ సిఎం చంద్రబాబునాయుడి లక్ష్యం నవ్యాంధ్ర నిర్మాణం. ఈ అపరచాణక్యుడి ఆశయం ప్రపంచస్థాయి నగర నిర్మాణం.. దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలపడం. రాష్ట్ర విభజన అనంతరం తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా కాపాడుకోవడం కోసం రేయింభవళ్లు శ్రమిస్తున్నారు చంద్రబాబు. దేశ విదేశాలకు తిరుగుతున్నారు. 67ఏళ్ల వయసులోనూ నిత్యశ్రామికుడై 20గంటలూ పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యపార్టీగా కీలకపాత్ర పోషిస్తున్నారు. మోడీకి తల్లో నాలుకగా ఉంటూ.. కీలక పాలసీలు, విధానాలపై అనధికార ముఖ్య సలహాదారుడిగా మారుతున్నారు. నీతీఆయోగ్‌లో ముఖ్యభూమికలో ఉన్నారు.. నగదు రహిత లావాదేవీలు కోసం ఏర్పాటు చేసిన కీలక కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. అలా కేంద్రంలో నమ్మదగిన వ్యక్తిగా మరోసారి నిరూపించుకున్నారు. జాతీయరాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే నవ్యాంధ్రగా మార్చటం కోసం అత్యుత్తమ విధానాలను అవలంబిస్తూ.. ప్రణాళిక బద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే ప్రయత్నాల్లో ఉన్నారు చంద్రబాబు. అయినా సవాళ్లు ఆయన పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నట్టు అనుక్షణం వెంటాడుతున్నాయి. చంద్రబాబుకు ఇది అత్యంత కీలకమైన ఏడాది. ఆయన తన లక్ష్యానికి చేరుకోవడానికి క్రియాశీలంగా వ్యవహరించాల్సిన సమయం. ఇంకా రెండేళ్లు మాత్రమే ఉంది. చివరి ఏడాదిలో ఎన్నికల వాతావరణం ముంచుకొస్తుంది. అంటే ఏడాదిలో ఆయన ప్రగతి చూపించాలి. మొత్తం చేస్తారని జనం కూడా ఆశించడం లేదు. కానీ ఆచరణాత్మకంగా ముందుకెళుతున్నట్టు ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అప్పుడే విశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తుకు బాటలు పడతాయి. ఆ దిశగా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హైటెక్‌ సిటి రూపకర్తగా.. పర్యాటక రంగానికి వన్నెలద్దిన ఆధునికుడిగా ముద్రపడ్డ చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మాతగా నిరూపించుకోవడానికి అనుక్షణం తపిస్తున్నారు. మరోవైపు తనకు మీదపడుతున్న వయసుతో పాటు.. వారసుడ్ని కూడా సిద్దం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల క్రితమే లోకేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు ఇప్పుడు మంత్రిగా కేబినెట్‌లోకి కొడుకును తీసుకున్నారు. పార్టీలో తనకుచేదోడు వాదోడుగా ఉంటున్న తనయుణ్ని మంత్రిని చేశారు. నారావారిపల్లెలో 1950, ఏప్రిల్ 20వ జన్మించిన చంద్రబాబు రాజకీయంగా ఎక్కని మెట్లు లేవు.. చూడని పల్లాలు లేవు. అవాంతరాలను దాటుకుని అత్యున్నత శిఖరాలు అందుకున్నారు. ప్రధాన పదవిని సైతం కాదనుకున్న ఆయన ఇప్పుడు కూడా రాష్ట్ర నవనిర్మాణం కోసం పరితపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com