అమరావతి లో సింగపూర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

- May 15, 2017 , by Maagulf
అమరావతి లో  సింగపూర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

అమరావతి బృహత్‌ ప్రణాళిక రూపకల్పన, స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సింగపూర్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో బంధాన్ని మరింత బలోపేతం దిశగా సోమవారం కీలక ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. ఈ మేరకు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి, రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంపు, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సహకారాన్ని సింగపూర్‌ ప్రభుత్వం అందజేస్తుంది. ఎంవోయూలో భాగంగా ఏపీ ప్రభుత్వం సింగపూర్‌కు 1691 ఎకరాలు అందజేయనుంది. అమరావతిలో 6.84 చదరపు కిలోమీటర్‌ ప్రాంతాన్ని సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి చేయనుంది.
చంద్రబాబు విజన్‌ ప్రశంసనీయం: ఈశ్వరన్‌ 
అమరావతి ప్రాంతాన్ని ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అన్నారు. అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు విజన్‌ ప్రశంసనీయమని కొనియాడారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఏడీపీతో కలిసి కృష్ణా తీరంలో 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
అమరావతిని సింగపూర్‌లా నిర్మిస్తాం: చంద్రబాబు 
అమరావతి అభివృద్థిలో సింగపూర్‌ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్‌ మాదిరిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతి అభివృద్ధికి సింగపూర్‌ కేవలం 6 నెలల్లోనే బృహత్తర ప్రణాళిక ఇచ్చిందన్నారు. రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 33వేల ఎకరాలు సమీకరించామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com