బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు పాకిస్తానీల అరెస్ట్‌

- May 26, 2017 , by Maagulf
బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు పాకిస్తానీల అరెస్ట్‌

 9 నెలలుగా వీసా లేకుండా అక్రమ నివాసం
► ఇక్కడే ఆధార్, ఓటరు కార్డులు పొందిన వైనం

బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు పాకిస్తాన్‌ పౌరులతో పాటు వారికి సహకరిస్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తిని నగర పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ ముగ్గురు మారుపేర్లతో ఆధార్, ఓటర్‌ కార్డులు పొందడం గమనార్హం.

పోలీస్‌ కమిషనర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన మహ్మద్‌ సిహాద్‌ (30) ఖతార్‌లో ఉద్యోగం చేసే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన సమీర అబ్దుల్‌ రెహ్మాన్‌ (25) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లిని సమీర పెద్దలు వ్యతిరేకించారు. అదే సమయంలో సమీర దగ్గరి బంధువులైన ఖాసీప్‌ షంసుద్దీన్‌ (30), కిరోణ్‌ గులామ్‌ ఆలీ (25) కూడా ఖతార్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లినీ కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో నలుగురూ కలసి ఖతార్‌ నుంచి మస్కట్‌కు, ఆపై నేపాల్‌ రాజధాని ఖట్మండూ మీదుగా బీహార్‌లోని పాట్నాకు చేరుకున్నారు.

కొద్దికాలం అక్కడ ఉండి తర్వాత బెంగళూరులోని యారబ్‌నగర్‌కు వచ్చారు. తొమ్మిది నెలలుగా ఇక్కడే అద్దె ఇంట్లో ఉంటున్నారు. మహ్మద్‌ సిహాద్‌ స్థానిక బ్రోక్లరసాయంతో సమీర, ఖాసీప్, కిరోణ్‌లకు మారుపేర్లతో ఆధార్‌కార్డు, ఓటరు కార్డులను ఇప్పించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని బుధవారం అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com