జూన్ మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్న నైరుతి ఋతుపవనాలు

- May 29, 2017 , by Maagulf
జూన్ మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్న నైరుతి ఋతుపవనాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. మొన్నటి వరకూ ఎండలు అల్లాడిస్తే.. మెల్లమెల్లగా వీస్తున్న చల్లగాలులు హాయి గొలుపుతున్నాయి.. అక్కడక్కడ అప్పుడప్పుడూ చిరు జల్లులు పడుతున్నాయి. ఇదంతా నైరుతి రుతుపవనాల రాక మాయే. ఇవాళో, రేపో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవి జూన్ మొదటి వారానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని తెలిపింది.
అటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి  తుఫానుగా మారి తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపింది. దీనికి మొరాగా నామకరణం చేశారు. ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బలపడనున్న ఇది సాయంత్రం లోపు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ దగ్గర తీరం దాటనుంది. అయితే ఆంధ్రా కోస్తాపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు. పశ్చిమ దిశ నుంచి ఆంద్రావైపు వీచే గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని అంటున్నారు. 
వాతావరణ అస్థిరత వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావణ శాఖ హెచ్చరించింది. అటు మురిపిస్తున్న నైరుతి, ఇటు గాలులు  ఎండలను ఒక్కసారిగా ఉఫ్ మని ఊదేశాయి. పగలు కాస్త భానుడు చెమటలు కక్కిస్తున్నా.. సాయంత్రం ఉదయం మాత్రం చల్లగాలులు కాస్త ఉపశమనం ఇస్తున్నాయి. జూన్ మొదటి వారానికి నైరుతి రాష్ట్రంలోకి ప్రవేశించినా రెండో వారం నుంచి పూర్తిగా విస్తరించనున్నాయి.
అల్పపీడనం ప్రబావంతో రాబోయే నాలుగైదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి కదలికలతో దేశవ్యాప్తంగా మార్పులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చిరు జల్లుల అలజడి మొదలైంది. రుతుపవనాలు తీరాన్ని తాకనుండడంతో కేరళలో వర్షాలు మొదలయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com