తెలుగు చిత్రపరిశ్రమలో పెద్దదిక్కును కోల్పోయాం

- June 07, 2017 , by Maagulf
తెలుగు చిత్రపరిశ్రమలో పెద్దదిక్కును కోల్పోయాం

  తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరికీ ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చే పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మిగిలినట్లుందని దాసరి సంతాప సభలో ప్రముఖులు అన్నారు. దాసరి సంస్మరణార్థం బుధవారం ఫిలింఛాంబర్‌లో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో బుధవారం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిద్ధారెడ్డి, ఎంఎల్‌ సీ ఫరూక్‌, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌, జాయింట్‌ సెక్రటరీ జెవీఆర్‌, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కవిత, ఫిల్మ్‌ ఛాంబర్‌ సెక్రటరీ సాయి వెంకట్‌ జమున, గీతాజంలి, మల్కాపురం శివకుమార్‌, సురేష్‌ కొండేటి, తుమ్మల పల్లి రామసత్యనారాయణ, యాట సత్యనారాయణ, కట్టా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 'దాసరి భార్య పద్మగారిది మా సత్తుపల్లే. ఆయన ఎప్పుడూ మా ఊరు వస్తుండేవారు. రాజ్య సభ సభ్యుడిగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించి సత్తుపల్లిని అభివృద్ధి చేశారు. ఇక సినిమా రంగంలో ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం. ఎంతో మందికి సహాయసహకారాలను అందించిన వ్యక్తి ఈ రోజు మధ్యన లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాన'ని అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ 'పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. చిన్న నిర్మాతలకు ఆయన అండగా ఉండేవారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవారు. కల్చరల్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే ఫిలిం ఛాంబర్‌, చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఆయన ఎంతో సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు.
దర్శకుడు కోడి రామకృష్ణ మాట్లాడుతూ 'అనాధ అనే పదం విన్నాను. కానీ దాని అర్ధం దాసరి గారి మరణం తర్వాత తెలిసింది. ఆయన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. నిజాన్ని చెప్పడానికి ఎమోషన్‌ చాలా అవసరం అనేవారు. అది నా ప్రాక్టికల్‌ లైఫ్‌లో తర్వాత అర్ధమైంద'ని ఆయన తెలిపారు.
ఫిలింనగర్‌లో దాసరి విగ్రహం! 
మదరాసు నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్‌ తరలిరావడానికి దాసరి చేసి కృషి శ్లాఘనీయమనీ, ఇందుకుగాను తమిళ పరిశ్రమలో ఆయనకు ప్రత్యర్థివర్గం కూడా తయారయిందనీ, కొన్నాళ్ళు అక్కడివారు షూటింగ్‌కు రావడానికి నిరాకరించారని... దాసరి నారాయణరావు సంస్మరణసభలో పలువురు సీనియర్‌ జర్నలిస్టులు పేర్కొన్నారు. ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో ఛాంబర్‌లో జరిగిన సంతాప సభలో పలువురు మాట్లాడారు. రోజుకు నాలుగు సినిమాలు షూటింగ్‌ చేస్తూ.. మరోవైపు రికార్డింగ్‌లోనూ పాల్గొంటూ అర్థరాత్రి 2గంటలవరకు పనిచేసిన దాసరి నిరంతరం శ్రామికుడనీ, ఆయన మదరాసు నుంచి హైదరాబాద్‌ వస్తే అటూ ఇటూ కూడా ఎంతోమంది నిర్మాతలు ఆయన్ను విమానాశ్రాయానికి వచ్చి వీడ్కోలు పలికేవారనీ, అటువంటి దర్శకుడ్ని ఇక చూడలేమని.. అధ్యక్షుడు బి.ఎ.రాజు తెలిపారు. సినిమారంగంలో ఆయన చేసిన సేవలకుగాను ఫిలింనగర్‌లో దాసరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాయిరమేష్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com