1500 కేజీల హెరాయిన్ సీజ్ చేసిన నేవీ సిబ్బంది

- July 30, 2017 , by Maagulf
1500 కేజీల హెరాయిన్ సీజ్ చేసిన నేవీ సిబ్బంది

ఇటు హైదరాబాద్‌ను డ్రగ్స్ కేసు షేక్‌ చేస్తుంటే.. అటు గుజరాత్‌ తీరంలో వేల కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15వందల కిలోల డ్రగ్స్‌ను కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 3వేల 500 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. గుజరాత్‌ నౌకాశ్రయ సమీపంలో ఆగిన ఇరాన్‌కు చెందిన నౌకలో తనిఖీలు చేస్తుండగా పెద్ద మొత్తంలో హెరాయిన్‌ పట్టుబడింది. ఇది అంతర్జాతీయ స్మగ్లర్ల పనేనని అనుమానిస్తున్నారు అధికారులు.

ఒకప్పుడు గుజరాత్‌ తీరం గుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి ముంబైలో మారణహోమం సృష్టించారు. ఆనాటి దారుణం తర్వాత గుజరాత్‌ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ భద్రత పెంచారు. ప్రతీ నౌకను, పడవను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ నౌకను చెక్‌ చేయగా.. ఏకంగా 15వందల కిలోల హెరాయిన్‌ దొరికింది. డ్రగ్స్ సరఫరా వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉందా? అనే దిశగానూ ఎంక్వైరీ చేస్తున్నారు. 

హెరాయిన్ అనేది అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న విలువైన మత్తు పదార్థం. కొన్ని ఆఫ్రికన్‌, అరబ్ దేశాలు దీన్ని తయారు చేస్తుంటాయి. ఇంటర్నేషనల్‌ డ్రగ్ మాఫియా హెరియిన్‌ను వివిధ మార్గాల్లో అనేక దేశాలకు దొంగచాటుగా సప్లై చేస్తుంటుంది. అయితే.. భారత్‌లో అక్కడక్కడా.. అరకొరగా కొన్నిసార్లు హెరాయిన్‌ పట్టుబడినా.. ఇప్పటిలా ఇంత భారీ పరిణామంలో దొరకడం మాత్రం ఇదే తొలిసారి.

ఏకంగా 15వందల కిలోల హెరాయిన్‌ అంటే మాటలు కాదు. 3వేల 500 కోట్ల ఖరీదైన డ్రగ్‌ను భారత్‌కు రవాణా చేస్తున్నారంటే.. దీని వెనుక పెద్ద కుట్రే ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉగ్రవాదులను, దొంగనోట్లను ఇండియా సమర్థవంతంగా ఏరివేస్తుండటంతో.. బహుషా పాక్ ప్రేరిత సంస్థలు డ్రగ్స్‌తో భారత్‌లో అలజడి సృష్టించాలని భావించి ఉండొచ్చని అంచనావేస్తున్నారు. అయితే.. నౌక ఇరాన్‌కు చెందినది కావడంతో.. ఈ పని చేసింది అంతర్జాతీయ డ్రగ్స్ ముఠానా? లేక, పాక్‌ ప్రేరిత సంస్థలా? అనేది తేలాల్సి ఉంది. 

ఇంతటి భారీ పరిణామంలో డ్రగ్స్ ఎవరికి సరఫరా చేస్తున్నారనేది కూడా ఇక్కడ కీలకాంశంగా మారింది. ఇండియాలో ఎవరికి ఈ సరుకు చేరుస్తారు? డ్రగ్స్ స్మగ్లర్లకు భారత్‌లో ఎవరితో లింకులున్నాయి? ఎన్నాళ్లుగా ఈ దందా జరుగుతోంది? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? 15వందల కేజీల హెరాయిన్‌ను దేశవ్యాప్తంగా సప్లై చేసేంత నెట్‌వర్క్‌ నెలకొని ఉందా? ఇలా అనేక ప్రశ్నలు.. అంతకు మించి అనుమానాలు. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేసే దిశగా నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ సిద్ధమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com