అమరావతి లో ప్రపంచ శ్రేణిలో వెలయనున్నబిజినెస్ స్కూల్

- August 06, 2017 , by Maagulf

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)ను తలదన్నేలా ప్రపంచశ్రేణి ప్రమాణాలతో అమరావతిలో ఒక బిజినెస్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) తరహాలో ఇక్కడ కూడా ఒక అత్యున్నత వేదికను నిర్మించనున్నారు. 200 ఎకరాల్లో వీటిని నెలకొల్పనున్నారు. భారత వాణిజ్య మండలి(సీఐఐ) సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటుచేస్తుంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను తీసుకురాగలిగారు. ఇప్పుడు ఆయన అమరావతిలో కూడా అంతకంటే మించి ఉత్తమంగా ఉండేలా, దానికంటే పెద్ద స్థాయిలో ఐఎస్‌బీని ఏర్పాటుచేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇందులో మామూలుగా అందించే ఎంబీఏ కోర్సులతో పాటు కార్పొరేట్‌, పొలిటికల్‌, ఉన్నతాధికారుల పాలన (బ్యూరోక్రటిక్‌ గవర్నెన్స్‌) లాంటి వాటిలో ప్రత్యేక కోర్సులు అందిస్తారు. 300 నుంచి 500 మందికి ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు.

అలాగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం తరహాలో ఇక్కడ ప్రత్యేక ఫోరాన్ని ఏర్పాటుచేసి దానికి గుర్తింపు తీసుకురావాలనే తలంపుతో ఉన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిధుల కోసం ఇబ్బందులు లేకుండా కార్పొరేట్‌ సంస్థల సహకారంతో సీఐఐ భాగస్వామ్యంతో నిర్మించాలనేది ప్రతిపాదన. పంజాబ్‌లోని మొహాలీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను నాలుగు కార్పొరేట్‌ సంస్థల విరాళాలతో నిర్మించారు.

ఒక్కో సంస్థ రూ.50 కోట్లు ఇచ్చింది. ఇదే తరహాలో అమరావతిలో నిర్మించబోయే బిజినెస్‌ స్కూలుకు పది కార్పొరేట్‌ సంస్థల నుంచి విరాళాలు సేకరించనున్నారు. రూ.400 కోట్లు సేకరించడంతో పాటు రూ.వంద కోట్ల కార్పస్‌ఫండ్‌తో దీన్ని నిర్వహించనున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో బిజినెస్‌ స్కూలు నిర్మిస్తారు.

పది ఎకరాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తారు. మిగిలిన 90 ఎకరాల్లో జర్మనీలోని హానోవర్‌లో ఉన్నట్లు భారీ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తారు. దీనికయ్యే వ్యయాన్ని సీఐఐ భరిస్తుంది. 2018-19కల్లా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలనేది లక్ష్యం.

వచ్చే నెల నుంచి చర్చలు: అమరావతిలో బిజినెస్‌ స్కూలుకు సంబంధించి సీఐఐ ప్రతినిధులతో వచ్చే నెల నుంచి ప్రభుత్వం చర్చించనుంది. ఆర్థికాభివృద్ధి మండలి సీఐఐ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాక బిజినెస్‌ స్కూల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనుంది. బిజినెస్‌ స్కూలును ఎలా చేపట్టాలి? నిర్మాణం తదితర అనేక అంశాలను ఈ సందర్భంగా సీఐఐతో చర్చించి ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం ముందుకెళ్లనున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి సహకరించడానికి ప్రమోద్‌ సింగ్‌ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. హైదరాబాద్‌లో ఐఎస్‌బీని తీసుకురావడంలో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ఎంతో సహకరించారు. ఇప్పుడు కూడా అమరావతిలో ఆయన సేవలు వినియోగించుకుంటే ప్రయోజనకరమని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com