ఇక రైలుప్రయాణం ఆనంద దాయకం

- August 14, 2017 , by Maagulf
ఇక రైలుప్రయాణం ఆనంద దాయకం

భారత రైల్వేలను ఆధునీకరణ దిశగాపరుగులు పెట్టిస్తున్న కేంద్రం మరో సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే దేశంలోని అనేక రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాదాపు 3వేల రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా వినోదాన్ని అందివ్వబోతోంది. ఇందుకోసం వయాకామ్‌18, జీ, హంగామా, షెమారూ వంటి వీడియో ప్రొవైడర్స్‌ తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా అన్ని భారతీయ భాషల్లో సినిమాలు, వీడియోలను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుంది.

ఆయా రైళ్లలో ఉచితంగా లభించే వైఫై సేవల ద్వారా ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలో లాగిన్‌ అయ్యి ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు. ఇప్పటికే కొన్ని సంస్థలు బిడ్స్‌ వేసేందుకు ఆసక్తి చూపించాయని వచ్చే నెలలో తమ బిడ్లు దాఖలు చేస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. దాదాపు 24 కంపెనీలు ఇందుకోసం ముందుకొచ్చాయని అర్హత సాధించిన కంపెనీ వద్ద నుంచి వార్షిక లైసెన్స్‌ ఫీజు వసూలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. దీని ద్వారా రైల్వేకు దాదాపు రూ.500కోట్లు ఆదాయం లభించవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రతి కోచ్‌లోనూ ఓ డిస్ట్రిబ్యూషన్‌ బాక్స్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. అందులోని సమాచారాన్ని ప్రతిరోజు అప్‌డేట్‌ చేస్తారని దాని ద్వారా ప్రయాణికులు వివిధ వీడియోలు, సినిమాలను వీక్షించవచ్చని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com