'నిఠారి' హత్య కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు

- August 27, 2017 , by Maagulf
'నిఠారి' హత్య కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2006 నాటి నిఠారి వరుస హత్యలకు సంబంధించిన ఒక కేసులో ఇద్దరు దోషులకు సోమవారం గాజియాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. పింకీ సర్కార్‌(20) అనే పనిమనిషి అపహరణ, అత్యాచారం, హత్య కేసులో వ్యాపారవేత్త మొనీందర్‌ సింగ్‌ పందేర్‌కు, అతడి ఇంటి నౌకరు సురీందర్‌ కోలీకి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి పవన్‌ కుమార్‌ తివారి తీర్పు ఇచ్చారు. ఆధారాలను నాశనం చేసినందుకు కోలీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, పందేర్‌కు ఏడేళ్ల కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా వేశారు. 2006 అక్టోబరులో నోయిడాలోని పందేర్‌ నివాసానికి సమీపంలో పింకీని కోలీ అపహరించాడని, ఇంట్లో ఆమెపై అత్యాచారం జరిపి, చంపేశాడని సీబీఐ పేర్కొంది. ఆమె తల నరికి ఇంటి వెనకున్న కాలువలో పడేశాడని తెలిపింది.
నోయిడాలోని నిఠారి ప్రాంతంలో జరిగిన 19 క్రూర హత్యలు 2006 డిసెంబరులో వెలుగులోకి వచ్చాయి. పందేర్‌ నివాసంలో పోలీసులు 19 అస్థిపంజరాలను గుర్తించారు.
బాధితుల్లో ఎక్కువ మంది బాలికలు, చిన్న వయసులోని అమ్మాయిలే. 2007 జనవరిలో దర్యాప్తును సీబీఐ చేపట్టింది. మిఠాయిలు, చాక్లెట్లు ఆశ చూపి కోలీ బాలికలను పందేర్‌ నివాసానికి తీసుకెళ్లేవాడని, వారిని చంపేసి మృతదేహాలతో లైంగిక చర్యలో పాల్గొనేవాడనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కోలీ వారి మాంసం కూడా తిన్నాడు.
19 హత్య కేసులకుగాను 16 కేసుల్లో పందేర్‌, కోలీలపై అభియోగపత్రాలు దాఖలయ్యాయి. మిగతా మూడు కేసులను ఆధారాలు లేక మూసేయాల్సి వచ్చింది. పింకీ కేసుకు ముందు మొత్తం తొమ్మిది కేసుల్లో కోలీకి మరణశిక్ష పడింది. పందేర్‌కు కారాగార శిక్షలు పడ్డాయి.
మిగతా కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. బెయిలుపై ఉన్న పందేర్‌ను ప్రస్తుత కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com