మళ్లీ ముంబైని ముంచెత్తిన వర్షాలు
- September 19, 2017
ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతకు నగరం చిగురుటాకులా వణికిపోతోంది. నిన్నటి నుంచి కురుస్తున్న వానకు... నగరంలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. ఇక స్లమ్ ఏరియాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో... స్థానికులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. దాదాపు మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.
వాన, వరద దెబ్బకు రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షపు నీరు పట్టాలపై నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఆలస్యంగా నడుస్తుండగా... మరికొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కష్టాలు ఇబ్బంది పడుతున్నారు. ఇక అక్కడక్కడా రోడ్డుపై నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడక్కడా బస్సు సర్వీసులు కూడా ఆగిపోయాయి.
రెయిన్ ఎఫెక్ట్ విమాన సర్వీసులపై కూడా పడింది. కుండపోత వానకు ఎయిర్పోర్ట్ మునిగిపోయింది. రన్వేపైకి వాన నీళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమాన సర్వీసులన్నింటిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్లను శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మళ్లించారు. ఇవాళ కూడా వర్షాలు పడుతుండటంతో కొన్ని సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అత్యవసర విమానాల్ని దారి మళ్లిస్తున్నారు.
మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. నగరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మున్సిపల్ సిబ్బంది ఎక్కడికక్కడే వర్షం నీటిని తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా నెలక్రితం కూడా భారీ వర్షాలతో ముంబై వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలంతా ఇబ్బందులు పడ్డారు. ఆ విలయం నుంచి కోలుకొనే లోపు మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటం కలవరపెడుతోంది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









