హర్యానాలో 17ఏళ్ల విద్యార్ధి మరో బ్లూవేల్ మరణం

- September 25, 2017 , by Maagulf
హర్యానాలో 17ఏళ్ల విద్యార్ధి మరో బ్లూవేల్ మరణం

బ్లూవేల్‌ గేమ్‌ నిషేధించాలని కోర్టులు ఆదేశించాయి. లింకులు తీసేయాలని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను ప్రభుత్వాలు నోటీసులు ఇచ్చాయి. అయినా ఈ నీలి తిమింగలం టీనేజర్లను బలికోరుతూనే ఉంది. తెలిసీతెలియని వయసులో గేమ్ కదా అని మొదలుపెట్టిన చిన్నారులను టాస్కుల పేరుతో చిత్రహింసులు పెట్టి చివరకు మింగేస్తోంది. తాజాగా ఈ డెత్‌ గేమ్‌ మరో నిండుప్రాణం బలికోరింది. హరియాణాలోని పంచకుల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 17ఏళ్ల విద్యార్ధి చివరి టాస్క్‌లో భాగంగా ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గేమ్‌లో లాస్ట్‌ స్టేజ్‌లో భాగంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కుటుంబసభ్యులు గుర్తించారు.

బ్లూవేల్‌ గేమ్‌ దాని వల్ల ప్రమాదాల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే చిన్నారి కుసుమాలు నేలరాలిపోతున్నాయి. ఒక్కొక్కరుగా దీని మాయలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చావు కోరే ఆటలో లీనమై... తమకు తాము చిత్రహింసలు పెట్టుకుంటూ.. చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. దీనిపై చాలారాష్ట్రాలు నిషేధం విధించాయి.. కంపెనీలకు కోర్టు నోటీసులు వెళ్లాయి. అయినా లింకులు ఆగడం లేదు..  ఆన్‌ లైన్‌ మరణమృదంగానికి అంతం కనిపించడం లేదు. 

కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ ఆగస్టు15న గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మైక్రోసాఫ్ట్‌, యాహూ సంస్థలకు లేఖలు రాసింది. వెంటనే బ్లూవేల్‌ లింకులు తొలగించాలని నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో లింకులు రూపంలో వచ్చిన ఈ ఆటను నిషేధించడం సాధ్యం కాదని తాజా ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. అయితే సోషల్‌ మీడియా కంపెనీలు వీటిపై నిఘాపెడితే పట్టుకోవడం సులభమే.. కానీ నిర్లప్తతే ఇంకా ప్రాణాలు పోవడానికి కారణమంటున్నారు నిపుణులు.

గత మూడు వారాల్లో 12 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న15 మంది విద్యార్ధులు బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ గేమ్‌ కారణంగా ఇప్పటి వరకు మొత్తం 2వందల మంది చనిపోయారని మద్రాస్‌ హైకోర్టులో పిల్‌ వేసిన పొన్నయ్య అనే సామాజిక వేత్త కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అటు ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు అయింది. మద్రాస్‌, ఢిల్లీ హైకోర్టులు గేమ్‌ నిషేధించాలని ఆదేశించాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా నివేదికలు ఇవ్వాలని కంపెనీలకు, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చాయి. ఆన్ లైన్ గేమ్ బ్లూవేల్ చాలెంజ్ ను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో కూడా పిల్ దాఖలైంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎమ్ ఖాన్ విల్ క్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన సుప్రీం బెంచ్ ఈ పిల్ ను విచారించింది. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరింది. విద్యార్ధులను బలితీసుకుంటున్న ఈ గేమ్ ఎందుకు నిషేధం విధించడం లేదని కోర్టు అటార్నీ జనరల్ వెణుగోపాల్ ను ప్రశ్నించింది. మరి ఇప్పటికైనా బ్లూవేల్‌ గేం ఆటను నిషేధించి చిన్నారుల ప్రాణాలను కాపాడుతుందా చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com