మితిమీరుతున్న అరబ్ షేకుల ఆగడాలు

- October 02, 2017 , by Maagulf
మితిమీరుతున్న అరబ్ షేకుల ఆగడాలు

హైదరాబాద్‌: దర్జాగా వస్తారు. గుట్టుగా పెళ్లిచేసుకుని శోభనం పెళ్లికొడుకులుగా గడుపుతారు. మోజుతీరగానే స్వేచ్ఛగా తమ దేశం చెక్కేస్తారు. కాంట్రాక్టు పెళ్లితో అమాయక ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిన అరబ్‌షేక్‌లపై పోలీసులు కఠిన వైఖరికి సిద్ధమయ్యారు. బాధితుల నుంచి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అద్దె వివాహాలతో ప్రమేయం ఉన్న ముంబైకు చెందిన చీఫ్‌ ఖాజీ ఫరీద్‌ అహ్మద్‌ఖాన్‌, గ్రేటర్‌ ఖాజీ అలీ అబ్దుల్లా రయిఫా అలియాస్‌ వోల్టా ఖాజీల సహా 25 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఐదుగురు దళారులు, ఇద్దరు ఖాజీలు, ఇద్దరు అరబ్‌షేక్‌లను ఈ నెల 26న పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఖాజీలు నామమాత్రపు వివరాలతో మాకింతే తెలుసంటూ సమాధానమివ్వగా, షేక్‌లు మాత్రం పోలీసులు అడిగిన ప్రశ్నలకు మౌనమే జవాబు అన్నట్లుగా వ్యవహరించినట్లు సమాచారం. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేవలం వైద్యచికిత్స కొసమే వచ్చామంటూ బుకాయించటం కొసమెరుపు. వరుసగా సెలవులు రావటం, దసరా, మొహర్రం బందోబస్తు విధుల్లో పోలీసులు తలమునకలై ఉండటంతో వారిని పూర్తిస్థాయిలో విచారించలేక పోయినట్లు తెలిసింది. దీంతో మరోసారి నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానాన్ని కోరనున్నట్లు సమాచారం.
మూడేళ్లు.. 400 పెళ్లిళ్లు?
గ్రేటర్‌ ఖాజీగా వ్యవహరిస్తున్న రయిఫా అలియాస్‌ వోల్టా ఖాజీపై బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటి వరకూ సుమారు 400 కాంట్రాక్టు పెళ్లిళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఎంతమంది గల్ఫ్‌దేశాల్లో ఉన్నారు, ఇంకెందరు పాతబస్తీలో మగ్గిపోతున్నారనే సమాచారం రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దళారులుగా వ్యవహరించిన మహిళల్లో అధికశాతం కాంట్రాక్టు పెళ్లిళ్లతో ఎడారి దేశం చేరిన వారే కావటం విశేషం. మోసపోయి అక్కడకు చేరిన మహిళలే ఏజెంట్లుగా మారుతున్నారు. అక్కడి షేక్‌లకు అవసరమైన అమ్మాయిలను వెతికేందుకు హైదరాబాద్‌ చేరుతున్నారు. రెండు మూడు నెలల పాటు ఇక్కడే మకాం వేసి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాల గురించి ఆరా తీస్తారు. వారిలో అందమైన ఆడపిల్లలున్న వారి జాబితా తయారు చేస్తారు.
అమ్మాయిలను తమ వైపునకు తిప్పుకునేందుకు చిన్నపాటి బహుమతులు కొనిస్తారు. ఆ తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు దగ్గరై డబ్బు ఎరవేస్తారు. వారి నుంచి అంగీకారం రాగానే అరబ్‌షేక్‌లకు సమాచారం చేరవేస్తారు. ప్రస్తుతం ఇదే పనిలో షేక్‌లకు అమ్మాయిలను వెతికేందుకు సౌదీ నుంచి 10 మంది మహిళా ఏజెంట్ల నగరం చేరినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయటంతో వీరంతా అజ్ఙాతంలోకి చేరినట్లు సమాచారం. మహిళా ఏజెంట్లు పట్టుబడితే మరింత సమాచారం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com