హజ్ యాత్ర లో నూతన విధాన ప్రతిపాదన...రాయితీలు రద్దు .. నౌకాయానానికి ప్రోత్సాహం
- October 08, 2017
ముంబయి: నూతన హజ్ విధానంపై అధ్యయనం చేసిన కేంద్ర మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి సంఘం శనివారం ముసాయిదా పత్రాన్ని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీకి అందజేసింది. 2018-22కు సంబంధించిన ఈ విధాన పత్రంలో హజ్ యాత్రికులకు ఇచ్చే రాయితీలను క్రమేణా రద్దు చేయడం, మగవారి తోడు లేకుండా యాత్రకు వెళ్లే అవకాశాన్ని మహిళలకు కల్పించడం, ఖర్చులు తగ్గించేందుకు విమానయానం బదులు నౌకాయానాన్ని ప్రోత్సహించడం ఇందులో ప్రధానాంశాలు. 2022 నాటికి హజ్ యాత్ర రాయితీలను ఎత్తివేయాలని 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నక్వీ తెలిపారు. అయితే పేదలపై భారం పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాయితీల రద్దు కారణంగా ఆదా అయిన సొమ్మును ముస్లింల విద్యాప్రగతికి వెచ్చించనున్నారు. యాత్రకు విమానాల ద్వారా వెళ్లాలంటే ప్రస్తుతం 21 నగరాల్లో అవకాశం ఉండగా, ఆ సౌకర్యాన్ని తొమ్మిది నగరాలకే పరిమితం చేయనున్నారు. ఇకపై దిల్లీ, లఖ్నవూ, కోల్కత్తా, అహ్మదాబాద్, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ నుండి వెళ్లడానికి వీలుంటుంది. సౌదీకి విమానాల్లో వెళ్తుండడంతో ఖర్చు అధికమవుతున్న దృష్ట్యా నౌకల్లో పంపించే ఆలోచన ఉంది.అదేవిధంగా ఇప్పటివరకు మహిళలు మగవారి తోడు లేకుండా యాత్ర చేయడానికి వీలుండేది కాదు. వారు మెహ్రాం (రక్త సంబంధీకుడు) తోడు ఉంటేనే యాత్ర చేయాల్సి ఉంది. ఇకపై 45 ఏళ్లు దాటిన మహిళలు కనీసం నలుగురు కలిసి మగవారి తోడు లేకుండానే వెళ్లే అవకాశం కల్పించారు. 45 ఏళ్ల లోపు వారు మాత్రం మెహ్రాంతో కలిసి వెళ్లాల్సి ఉంటుంది. మెహ్రాంల కోటాను 200 నుంచి 500కు పెంచారు. యాత్రికుల కోటాను భారతీయ హజ్ కమిటీ, ప్రైవేటు టూరు ఆపరేటర్ల మధ్య 70:30 నిష్పత్తిలో పంచాలని నిర్ణయించారు. దీనిపై అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









