తమిళ కమెడియన్ నటుడు సంతానంపై కేసు

- October 10, 2017 , by Maagulf
తమిళ కమెడియన్ నటుడు సంతానంపై కేసు

గుత్తేదారుడిపై దాడిచేసిన వ్యవహారంలో తమిళ నటుడు సంతానంపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నగర శివారులోని కోవూర్‌ మూండ్రాం కట్టళైలో కల్యాణ మండపం నిర్మించాలని నటుడు సంతానం, వళసరవాక్కం చౌదరి నగర్‌కు చెందిన గుత్తేదారుడు షణ్ముఖసుందరం గతంలో నిర్ణయించారు. దీనికి సంబంధించి తన వంతుగా భారీ మొత్తాన్ని షణ్ముఖసుందరానికి సంతానం అందజేసినట్లు సమాచారం. తర్వాత కల్యాణ మండపం నిర్మాణ నిర్ణయాన్ని ఇద్దరూ విరమించుకోవడంతో తన డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని సంతానం కోరారు. కొంత మొత్తం ఇచ్చిన షణ్ముఖసుందరం మిగిలిన మొత్తం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో సంతానం తన మేనేజర్‌ రమేశ్‌తో కలిసి వలసరవాక్కంలోని షణ్ముఖసుందరం కార్యాలయానికి సోమవారం వెళ్లి మిగిలిన డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారని, ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. చివరకు ఘర్షణకు దారితీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారన్నారు. ఆ సమయంలో షణ్ముఖసుందరం మిత్రుడైన న్యాయవాది ప్రేమ్‌ ఆనంద్‌ అక్కడ ఉండటంతో ఆయనపై కూడా దాడి చేశారన్నారు. ఇందులో ఇరువర్గాలు గాయాలతో వడపళనిలోని విజయ ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. న్యాయవాది ప్రేమ్‌ ఆనంద్‌ భాజపా ప్రముఖుడు కూడా కావడంతో ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి రావడంతో ఉత్కంఠ చోటుచేసుకుంది.

అదే సమయంలో ఆస్పత్రి నుంచి సంతానం తన కారులో బయటకు వెళ్లిపోయారు. తనపై నటుడు సంతానం దాడిచేసి గాయపరిచినట్లు గుత్తేదారుడు షణ్ముఖసుందరం వళసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సంతానంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా కార్యకర్తలు సోమవారం అర్ధరాత్రి వళసరవాక్కం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో వారికి నచ్చజెప్పి పోలీసులు..

మంగళవారం ఉదయం సంతానంపై దుర్భాషలాడటం, దాడికి పాల్పడటం, హత్య బెదిరింపు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సంతానం తరఫున ప్రేమ్‌ ఆనంద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మేరకు కేసు నమోదు చేశామన్నారు. విచారణ నిమిత్తం సంతానాన్ని సంప్రదించడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉందన్నారు. ఈ ఘటన తమిళ చిత్రపరిశ్రమలో అలజడి సృష్టించింది.

తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు కాకుండా ఉండడానికి నటుడు సంతానం ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు.
పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక'ప్రజాశక్తి పెళ్లిపుస్తకం'. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com